Karnataka Elections: ఖర్గే హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందా.. అసలు ఎవరీ మణికంఠ్‌ రాథోడ్‌..

కర్నాటకలో ఎన్నికలు రోజు రోజుకూ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు సామ దాన బేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాయి. పోలింగ్‌కు ఇంకా మూడు రోజులే ఉండటంతో ప్రచారం స్పీడ్‌ పెంచాయి. ఎలాగైనా పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ హై కమాండ్‌లు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి.

ఇలాంటి సిచ్యువేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ మీద ఓ సీరియస్‌ ఎలిగేషన్‌ చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మణికంఠ్‌ రాథోడ్‌ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను చంపేదుకు కుట్ర చేస్తున్నాడని చెప్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా ఈ ఆరోపణ చేశారు. మణికంఠ్‌ రాథోడ్‌ మట్లాడిన ఆడియో టేప్‌ను కూడా ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వెంటనే ఈ విషయంలో విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కానీ బీజేపీ మాత్రం రణ్‌దీప్‌ సింగ్‌ ఆరోపణను చాలా సింపుల్‌ తీసుకుంది. ఇప్పుడు ఈ విషయంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కలబుర్గి జిల్లాలోని చిత్తాపుర నుంచి పోటీ చేస్తున్న మణికంఠ్‌ రాథోడ్‌ మీద ఇప్పటికే చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ప్రస్తుతం కర్నాటక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అందరికంటే ఎక్కువ క్రిమినల్‌ కేసులు ఉన్న వ్యక్తి మణికంఠ్‌ మాత్రమే. ఈ కారణంగానే ప్రధాని మోదీ మణికంఠ్‌ ప్రచారానికి కూడా వెళ్లలేదు. అలాంటి వ్యక్తికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందన్న కారణంగా మోదీ ప్రచారానికి వెళ్లలేదని బీజేపీలో ఇంటర్నల్‌ టాక్‌. నిజానికి అలాంటి వ్యక్తికి పార్టీ టికెట్‌ ఇవ్వడమే తప్పంటున్నారు పొలిటికల్‌ అనలిస్ట్‌లు. టికెట్‌ మాట పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణను సింపుల్‌గా తీసుకోవడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

నిజంగానే మణికంఠ్‌ రాథోడ్‌ ఖర్గేను చంపేందుకు ప్రయత్నిస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బయటికి వచ్చిన ఆడియో టేప్‌ నిజమైందా కాదా అని తెలుసుకునేందుకు నిమిషాల సమయం కూడా పట్టదు. కానీ ప్రభుత్వం ఆ విధంగా రియాక్ట్‌ కాకపోవడం ఇప్పుడు బీజేపీని విమర్శల పాలు చేస్తుంది. ఒకవేల ఆడియో టేప్‌ అబద్ధమైతే అది కాంగ్రెస్‌ పార్టీకే చేటు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ ఆ అవకాశాన్ని వాడుకోవచ్చు. మణికంఠ్‌ రాథోడ్‌ కూడా రణ్‌దీప్‌ సింగ్‌పై పరువునష్టం దావా వేయొచ్చు. ఈ రెండు చాన్స్‌లు ఉన్నా కూడా బీజేపీ రియాక్ట్‌ కాకపోవడంతో.. రణ్‌దీప్‌ సింగ్‌ చేసిన ఆరోపణ నిజమేననే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒక్క ఆడియో టేప్‌ ఇప్పుడు కర్నాటకను షేక్‌ చేస్తోంది.