Karnataka: కన్నడ రాజకీయాల్లో ఆటో పంచ్‌లు ఆటోవాలా ఎవరి ఫేట్ మార్చబోతున్నాడు ?

కన్నడ రాజకీయాలు కాకమీద కనిపిస్తున్నాయ్. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ.. కమలాన్ని కొట్టాలని కాంగ్రెస్‌.. సత్తాచాటాలని జేడీఎస్.. ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు ఒకవైపు.. సినీ కలరింగ్ మరోవైపు.. కాంగ్రెస్ దూకుడు ఇంకోవైపు.. తగ్గేదే లే అంటున్న జేడీఎస్ మరోవైపు.. ఇలాంటి పరిణామాలతో కర్నాటక రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయ్. గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కోల్పోయేందుకు కూడా పార్టీలు సిద్ధంగా కనిపించడం లేదు.

  • Written By:
  • Publish Date - April 9, 2023 / 06:50 PM IST

ఐతే ఇప్పుడు కన్నడ పార్టీలన్నీ ఆటోలో  ప్లేస్‌ కోసం.. ఆటోవాలా మనసులో ప్లేస్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయ్. దీంతో కర్ణాటక రాజకీయాలన్నీ ఆటోవాలాల చుట్టూ తిరుగుతున్నాయ్. వచ్చే నెలలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆటో డ్రైవర్ల దయ కోసం అధికార బీజేపీ మొదలు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయ్. హామీలతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయ్. రాష్ట్రంలో 7లక్షల 7వేల లక్షలు ఆటోలు ఉన్నాయ్. వీటిలో ఆరు లక్షల ఆటోలు యాక్టివ్‌గా ఉన్నాయ్.

ఒక్కో ఆటోవాలా కుటుంబంలో కనీసం నలుగురిని లెక్కలోకి తీసుకున్నా దాదాపు 25లక్షల ఓట్ల వరకు ఉంటాయ్. అంటే.. ఎన్నికల ఫలితాలను వీరు ప్రభావం చేసి అవకాశం ఉన్నట్టే ! వీరు ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉండే చాన్స్ ఉంది. దీంతో వారిని ఆకర్షించి తమ వైపునకు తిప్పుకునేందుకు పార్టీలన్నీ ప్రణాళికలు రచిస్తున్నాయ్. తాము అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 2 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తామని ప్రతిపక్ష జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అంతేకాదు, వారి సమస్యలను పరిష్కరిస్తామని, పోలీసులు, రవాణాశాఖ అధికారుల వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌, బీజేపీ కూడా ఆటోవాలాలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయ్. ఇటీవల బెంగళూరులో ఆటోవాలాలతో నిర్వహించిన సమావేశంలో… కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ ఖాకీ చొక్కా ధరించి, స్వయంగా ఆటో నడిపి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సాధారణ జనాల రథసారథులు మీరేనంటూ వారిని ఆకాశానికెత్తేశారు. ఇక తామేమీ తక్కువ కాదన్నట్టు అధికార బీజేపీ కూడా ముందుకొచ్చింది. తాము ప్రకటించిన బడ్జెట్‌లో ఆటోవాలాల పిల్లల కోసం ప్రకటించిన రైతా విద్యానిధి పథకాన్ని గుర్తు చేస్తూ.. తమకు ఓటేయాలని కోరుతోంది. ఆటోవాలాల మనసు గెలుచుకునేందుకు పార్టీలు ఆటో పంచ్‌లు కూడా వేస్తున్నాయ్. ఇప్పుడే ఇన్ని సిత్రాలు ఉంటే.. ఎన్నికల నాటికి సీన్ ఇంకెలా మారుతుందో మరి కర్ణాటకలో !