KCR: కొత్త ప్లాన్‌తో వస్తున్న కేసీఆర్‌.. రేపటి నుంచి రెండో విడత ప్రచారం..

ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగి.. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తూనే ఉన్నారు. రోజుకు మూడు సభల్లో పాల్గొంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

  • Written By:
  • Updated On - November 12, 2023 / 07:23 PM IST

KCR: తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఇక తమ హామీలతో ప్రజల ఓట్లు గెలుచుకోవడమే తరువాయి. ప్రచారంలో అన్ని పార్టీల కంటే ఓ అడుగు ముందున్న బీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి విడత ప్రచారాన్ని కూడా పూర్తి చేసింది. ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న బీఆర్ఎస్.. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు పారిస్తోంది.

REVANTH REDDY: దాడుల పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు.. హరీష్ రావుది సురభి నాటకం: రేవంత్ రెడ్డి

ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగి.. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తూనే ఉన్నారు. రోజుకు మూడు సభల్లో పాల్గొంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అక్టోబర్ 15న మొదలు పెట్టిన ఈ ప్రచారయాత్ర 17 రోజుల్లో 41 సభలు కవర్‌ చేసింది. అయితే.. నవంబర్ 9న నామినేషన్లు వేసి కామారెడ్డిలో సభతో ఆ విడత షెడ్యూల్ పూర్తి చేశారు కేసీఆర్‌. ఇప్పుడు రెండో విడత ప్రచార షెడ్యూల్‌ను కూడా ప్రకటించేశారు. రెండో విడత ప్రచారంలో భాగంగా.. సీఎం కేసీఆర్, ఈ నెల 13 నుంచి 28 వరకు మిగిలిన ప్రాంతాలను కవర్‌ చేయబోతున్నారు.

16 రోజుల్లో మొత్తంగా 54 సభల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే.. ఇప్పటికే రాజశ్యామల యాగాన్ని పూర్తి చేసిన కేసీఆర్, తన సెంటిమెంట్ అయిన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు. అభ్యర్థులకు బీ-ఫాంలు కూడా ఇచ్చేశారు. వాళ్లు కూడా నామినేషన్లు వేశారు. ఇక మిగిలింది కేవలం ప్రచారమే. దీంతో.. ఇప్పటివరకు నాలుగో గేర్‌లో వెళ్లిన కారు.. ఇప్పటి నుంచి టాప్ గేర్‌లో దూసుకుపోనుంది.

ఈ నెల 25న హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించి.. జంటనగరాల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు కేసీఆర్. ఇక చివర్లో తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌‌లో సభ నిర్వహించబోతున్నారు. ఈ నెల 28న సభతో ఎన్నికల ప్రచారానికి ముగింపు పలుకనున్నారు కేసీఆర్.