Malkajgiri: మల్కాజ్‌గిరి ఎంపీ సీటుకి సూపర్ డిమాండ్.. 100 కోట్లు పెట్టే మొనగాడు ఎవరు..?

2008 డీలిమిటేషన్‌లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం ఏర్పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2019లో ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం ఈసారి ఎవరి పరమవుతుందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది.

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 05:09 PM IST

Malkajgiri: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత హాట్ సీట్.. హైదరాబాదులోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానమే. ఎక్కడెక్కడి లీడర్లు అంతా మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయడానికి ఉవిళ్లూరుతున్నారు. ఇండియాలోని అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటైన మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో 32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2008 డీలిమిటేషన్‌లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం ఏర్పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2019లో ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం ఈసారి ఎవరి పరమవుతుందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. హైదరాబాదులో అత్యంత కీలకమైన ఏడు అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాలు మల్కాజ్‌గిరి కిందకు వస్తాయి.

REVANTH REDDY: గ్రూప్‌ 1, 2.. ఎక్కడ రేవంత్ సార్‌.. ఆడుకుంటున్న నిరుద్యోగులు..

మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాలు మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో ఉన్నాయి. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్ని బీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం. అలాగని రేపు లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుంది అని చెప్పలేం. 2019లో ఈ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఎవరికి దక్కుతుందో చూడాలి. అత్యంత ఖరీదైన ఎన్నికలు కూడా మల్కాజ్‌గిరిలోనే జరుగుతాయి. ఇక్కడ ఎంపీగా గెలవాలంటే కనీసంలో కనీసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలగాలి. అంతేకాదు.. ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లోనూ సీమాంధ్ర ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. మేడ్చల్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రా రెడ్డి ఈసారి ఇక్కడి నుంచి పోటీచేయబోతున్నారు. అనూహ్యంగా నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి మల్కాజ్‌గిరి నుంచి పోటీచేయాలని ఆశతో ఉన్నారు.

YS SHARMILA: ఏపీకి ప్రత్యేకహోదా కోసం షర్మిల దీక్ష.. జాతీయ నేతలతో భేటీ..

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా కాంగ్రెస్ తరపున మల్కాజ్‌గిరి సీటు కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. సినిమాలు, టీవీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో తరచూ చేసే రచ్చతో బండ్ల గణేష్ బాగానే పాపులర్ అయ్యారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం, సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కనుక తన గెలుపు తేలిక అవుతుందని బండ్ల గణేష్ భావిస్తూ ఉండొచ్చు. మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు.. ఇక్కడ ఖర్చును దృష్టిలో పెట్టుకొని తాను ఎంపీగా పోటీ చేయనని తేల్చి చెప్పేశారు. హరివర్ధన్, ఎమ్మెల్సీ దిలీప్‌లు తరపున పెట్టినా.. వాళ్లకి సీటు గ్యారంటీ లేదు. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డితో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు మల్కాజ్‌గిరి కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈసారి ఇక్కడ బిజెపి గెలవొచ్చని అనుమానం అందరిలోనే ఉంది.

అర్బన్ నియోజకవర్గం కావడం, లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ఫేస్ వాల్యూపై ఓట్లు పడే ఛాన్స్ ఉండడం, ఈమధ్య అయోధ్యతో బిజెపి గ్రాఫ్ పెరగడంతో ఈసారి ఇక్కడ బిజెపికి ఎక్కువ అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. బిజెపి సీట్ కోసం కూడా చాలామంది ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తం మీద అతి పెద్ద నియోజకవర్గం కాదు.. ఖరీదైన నియోజకవర్గం కూడా మల్కాజ్‌గిరినే కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి మాజీ నియోజకవర్గం ఎవరికి దక్కుతుందో అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది.