Arvind Dharmapuri: అర్వింద్ వర్సెస్ కాంగ్రెస్.. షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయం..

తంలో పసుపు బోర్డు కోసం రైతులు నామినేషన్లు వేసినట్టుగానే ఈసారి చక్కర ఫ్యాక్టరీ కోసం కూడా నామినేషన్లు వేయాలని కూడా కార్మికులు, రైతులకు సూచిస్తున్నట్టు తెలిసింది. దీంతో అలర్ట్‌ అయిన కాంగ్రెస్‌.. ఇక్కడ మేం లేమా అంటూ.. అధికారిక కమిటీని వేసేసింది.

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 07:35 PM IST

Arvind Dharmapuri: పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే.. నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. కాకుంటే.. బోధన్‌ చక్కెర ఫ్యాక్టరీ కేంద్రంగా రాజకీయం రగులుకోవడమే ఆసక్తికరంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతో బాండ్ పేపర్ రాసిచ్చి బరిలో దిగిన ఎంపీ అర్వింద్.. ఈసారి బోధన్‌ షుగర్స్ ప్రధాన అజెండాగా రైతుల ఓట్లు కొల్లగొట్టే ప్లాన్‌ సిద్ధం చేశారట. పసుపు బోర్డు ప్రకటన ప్రధానితో ఇప్పించినట్టే.. ఈసారి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటూ బాండ్ పేపర్ పాలిటిక్స్‌కు రెడీ అయ్యారాయన.

BRS: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఎవరు..? ఇంకెప్పుడు తేలుస్తారు..?

గతంలో పసుపు బోర్డు కోసం రైతులు నామినేషన్లు వేసినట్టుగానే ఈసారి చక్కర ఫ్యాక్టరీ కోసం కూడా నామినేషన్లు వేయాలని కూడా కార్మికులు, రైతులకు సూచిస్తున్నట్టు తెలిసింది. దీంతో అలర్ట్‌ అయిన కాంగ్రెస్‌.. ఇంకో అడుగు ముందుకేసి ఫ్యాక్టరీని తెరిపించడానికి బాండ్లు గీండ్లు ఎందుకు..? ఎవరో వచ్చి చెప్పడమెందుకు..? ఇక్కడ మేం లేమా అంటూ.. అధికారిక కమిటీని వేసేసింది. ఇదిగో మా చిత్తశుద్ధి చూడండంటూ స్థానిక ఓటర్ల మనసు దోచుకునే పనిలో ఉన్నారు కాంగ్రెస్‌ నాయకులు. గవర్నమెంట్‌ కమిటీ కూడా చక్కర ఫ్యాక్టరీని సందర్శించి రైతులు, కార్మికుల అభిప్రాయాలు సేకరించిందట. ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత మాదంటే మాదేనంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు హామీల మీద హామీలు ఇచ్చేస్తుండటంతో.. నమ్మాలో, పొలిటికల్‌ స్టంట్స్‌ అనుకోవాలో అర్ధంగాక గందరగోళంలో ఉన్నారు రైతులు, కార్మికులు. దీని మీద రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తూ హీట్‌ పెంచుతోంది. ఎన్నికల సమయంలో మాత్రమే షుగర్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు అంశాలు తెరపైకొస్తాయి.

Venu Swamy: వైన్ బాటిల్‌తో వేణుస్వామి పూజలు.. డింపుల్‌తో పూజ ఫొటో వైరల్

గత ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చిన ఎంపీ అర్వింద్.. ఇందూరు వేదికగా ప్రధానితో ప్రకటన చేయించారు. ఐతే బోర్డును ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు. కానీ.. బీజేపీ మాత్రం ప్రధాని ప్రకటించేశారంటూ ఏకంగా నిజామాబాద్‌లో బోర్డ్‌ పెట్టేసినంత హంగామా చేస్తూ రాజకీయం మొదలుపెట్టిందన్నది లోకల్‌ టాక్‌. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ఉన్న అర్వింద్ బోధన్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు అనుబంధంగా ఉన్న ముత్యంపేట చక్కెర కర్మాగారం దాకా పాదయాత్ర చేశారు. తాను ఎంపీగా గెలిస్తే పారిశ్రామిక వేత్తలను తీసుకొచ్చి ప్యాక్టరీని తెరిపిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి మర్చిపోయి మళ్లీ బాండ్ అంటూ అదే అంశం మీద కొత్త రాజకీయం మొదలుపెడితే నమ్మాలా అన్నది క్వశ్చన్‌. ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీ పేరుతో అన్ని పార్టీలు పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయని మండిపడుతున్నారు. రైతులు, కార్మికులు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కువ శాతం చెరకు రైతులు ఉండటంతో..వారి మద్దతు కోసం మరోసారి ఫ్యాక్టరీ జపం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మరి రైతులు ఈసారి ప్రభుత్వ వేసిన కమిటీని నమ్ముతారా.. లేదా అర్వింద్‌ ఇచ్చే బాండ్ పేపర్ కు జై కొడతారా అన్నది వేచిచూడాలి.