Anurag Thakur: లిక్కర్ కేసులో కవితను విడిచిపెట్టం.. కాళేశ్వరం అవినీతిని కేటీఆర్ ఒప్పుకొన్నట్లే: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చైతే.. రూ.లక్ష కోట్ల కరప్షన్ జరిగిందని అంటున్నారని మంత్రి కేటీఆర్ అంటున్నారు.. అంటే కరప్షన్ జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా..! మరి ఎంత అవినీతి జరిగిందో ఆయన తన తండ్రి కేసీఆర్‌ను అడిగి చెప్పాలి.

  • Written By:
  • Updated On - November 4, 2023 / 06:42 PM IST

Anurag Thakur: ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు ఉందని, ఆమెను ఎలా విడిచిపెడతామని అభిప్రాయపడ్డారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. హవాలా డబ్బుతో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. శనివారం తెలంగాణలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌పై విమర్శలు చేశారు. “బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదు.. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే విడిచిపెట్టలేదు. కవితను ఎలా విడిచిపెడతారు..? కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చైతే.. రూ.లక్ష కోట్ల కరప్షన్ జరిగిందని అంటున్నారని మంత్రి కేటీఆర్ అంటున్నారు.. అంటే కరప్షన్ జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా..! మరి ఎంత అవినీతి జరిగిందో ఆయన తన తండ్రి కేసీఆర్‌ను అడిగి చెప్పాలి.

నాడు కాంగ్రెస్.. రామభక్తులపై బుల్లెట్లు దింపింది. కేసీఆర్..! నీకు దమ్ముంటే.. నువ్ గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా..? దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామన్నరు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నరు..? ఆ హామీల అమలు ఏమైంది..? దేశంలో వరల్డ్ కప్ జరుగుతోంది. భారత టీం అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అలాగే.. తెలంగాణ ఎన్నికల సందర్భంగా బ్యాట్స్‌మెన్‌గా నన్ను పంపించారు. ఛతీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎంతో దోచుకుంది. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయింది. రాజస్థాన్ సచివాలయంలో కోట్లు, కిలోల కొద్దీ బంగారం దొరికింది. విదేశాల నుంచి డబ్బులను ఎన్నికల కోసం తెప్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోంది. మహాదేవ్ యాప్ పేరుతో దేవుడి పేరును చెడగొట్టారు. మహాదేవ్ యాప్ పేరిట రూ.508 కోట్లు ఛతీస్‌గఢ్ సీఎం భూపేష్ భాగేల్‌కు అందాయి. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్కవుట్ అవ్వడం లేదు.

అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలు ఇస్తోంది. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కోసం విదేశాలు, మహాదేవ్ యాప్, కర్ణాటక నుంచి డబ్బు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల ఎంతోమంది మరణించారు. పార్లమెంట్‌లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో నాకు తెలుసు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారు. 10 ఏండ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు.

లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరి నంబర్ వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిందే. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్. రాజస్థాన్‌లో ఉన్నద గెహ్లాట్ సర్కార్ కాదు.. గెహ్ లూట్ సర్కార్” అని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.