YCP MLAs : వైసీపీ ఎమ్మెల్యేల్లో దడ.. సీటు కి నో గ్యారెంటీ..

వైసీపీ సిట్టింగ్‌ సీట్ల మార్పిడి ఎమ్మెల్యేల్లో దడ పుట్టిస్తోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో జరిగిన మార్పులు కలవర పెడుతుండగా.. జరగబోయేవాటిని తల్చుకుని సిట్టింగ్‌లకు నిద్ర కూడా పట్టడం లేదట. పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ లాంటి మాజీ మంత్రులు సీటు మార్పు అనేది తిరిగి అధికారం సాధించే క్రమంలో ఒక ప్రక్రియ అని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటిస్తున్నారు.

వైసీపీ సిట్టింగ్‌ సీట్ల మార్పిడి ఎమ్మెల్యేల్లో దడ పుట్టిస్తోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో జరిగిన మార్పులు కలవర పెడుతుండగా.. జరగబోయేవాటిని తల్చుకుని సిట్టింగ్‌లకు నిద్ర కూడా పట్టడం లేదట. పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ లాంటి మాజీ మంత్రులు సీటు మార్పు అనేది తిరిగి అధికారం సాధించే క్రమంలో ఒక ప్రక్రియ అని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటిస్తున్నారు. పేర్ని నాని అయితే.. ఈసారి తనకు బదులు కుమారుడు కిట్టు పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించేశారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో.. టికెట్ ఇస్తే కిట్టు పోటీ చేస్తారని కాదు ఎవరికి ఇచ్చినా తన సహకారం ఉంటుందని అన్నారు. అంతవరకు ఓకేగానీ.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరు సిట్టింగుల స్వరం మాత్రం వేరేలా ఉందట.తిరువూరులో రెండు సార్లు గెలిచిన రక్షణ నిధి హ్యాట్రిక్‌ కొడతానంటూ ధీమాగా ఉన్నారు. పెడన నుంచి రెండు సార్లు గెలిచిన మంత్రి జోగి రమేష్‌ ఈసారి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ… తాను మళ్ళీ పెడన బరిలోనే ఉంటానని నెల రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చేశారాయన. ఇక బెజవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కూడా అధిష్టానం హిట్ లిస్టులో తాను లేనని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తానని చెబుతున్నారట.

కానీ.. అక్కడే ఏదో తేడా కొడుతోందంటున్నాయి పార్టీ వర్గాలు సీటు మాదే.. మేమే పోటీ చేస్తామని వాళ్ళు చెప్పుకోవడం వరకు బాగానే ఉందిగానీ.. సిట్టింగ్‌లకు సీట్లు ఎగిరిపోతున్న పరిస్థితుల్లో సీటు మీద డౌట్‌తోనే ఆ నేతలంతా అలా మాట్లాడుతున్నారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట. ఏపీలో అధికార, ప్రతిపక్షాలు రెండూ ఈసారి డూ ఆర్‌ డై అన్నట్టుగా తలపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో రిస్క్‌ తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీలో పరిస్థితి తీవ్రంగానే ఉందంటున్నారు. ఎక్కువ మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కొనసాగించడం వల్లే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని బలంగా నమ్ముతున్న వైసీపీ అధినాయకత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఈ సమయంలో పార్టీలో కొందరు నేతలు అధిష్టానం నిర్ణయానికి మద్ధతుగా నిలుస్తుంటే మరికొందరు మాత్రం సీటు కాపాడుకునే ప్రయత్నంలో తమ స్వరాన్ని పార్టీ అధిష్టానానికి ఏదో ఒక రూపంలో తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.

ఉమ్మడి కృష్ణాలో సీటు డౌటున్న కొందరు సిట్టింగ్‌లు కూడా అందుకే ఈసారి మేమే పోటీ చేస్తామంటూ స్వరం పెంచినట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. అదే విషయాన్ని పదేపదే చెప్పడం ద్వారా.. తమ వాయిస్‌ హైలైట్‌ అవ్వాలని కోరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అనుమానాలు లేని వారు పార్టీ నిర్ణయానికి మద్దతిస్తున్నారని, ఉన్నవారు మాత్రం చర్చ జరిగేలా పావులు కదుపుతున్నారన్నది పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. మరి రానున్న రోజుల్లో జరిగే మార్పులు సిట్టింగ్ లకు ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తాయో చూడాలి.