Chandrababu Naidu‎: సిట్ విచారణతో చంద్రబాబుకు చుక్కలేనా? అరెస్టు ఖాయమా?

టీడీపీ అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు 2019 జూన్ 26న కేబినెట్ సబ్ కమిటీ, 2020 ఫిబ్రవరి 21న సిట్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. దీంతో ఇవి విచారణ ప్రారంభించాయి. ఈ దర్యాప్తును వ్యతిరేకిస్తూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు స్టే విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

  • Written By:
  • Publish Date - May 4, 2023 / 02:16 PM IST

Chandrababu Naidu: అమరావతి స్కాంతోపాటు పలు అంశాల్లో టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు సిట్‌కు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఇది చంద్రబాబు నాయుడుకు భారీ దెబ్బకాగా.. జగన్‌కు మాత్రం విజయంగానే చెప్పాలి. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఏపీ సిట్ దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే చంద్రబాబుకు చుక్కలు కనిపించడం ఖాయమా? బాబు అరెస్టు తప్పదా? టీడీపీ పని అయిపోయినట్లేనా?
ఆంధ్రప్రదేశ్‌లో 2014-2019 వరకు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ అధికారంలో ఉంది. ఈ సందర్భంగా అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో భారీ కుంభకోణం జరిగిందని వైఎస్ జగన్ ఆరోపిస్తూ వచ్చారు. ఇక్కడి భూముల కొనుగోలు, కేటాయింపులు సహా అనేక విషయాల్లో చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు 2019 జూన్ 26న కేబినెట్ సబ్ కమిటీ, 2020 ఫిబ్రవరి 21న సిట్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. దీంతో ఇవి విచారణ ప్రారంభించాయి. ఈ దర్యాప్తును వ్యతిరేకిస్తూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు స్టే విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిట్ విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని కొట్టిపారేసింది. హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చి ఉండాల్సింది కాదని అభిప్రాయపడింది. దీంతో ఇకపై చంద్రబాబు అవినీతిపై సిట్ విచారణకు మార్గం సుగమం కానుంది. సిట్ ఏం తేలుస్తుంది అనేదానిపైనే టీడీపీ, చంద్రబాబు భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
జగన్ ప్లాన్ సక్సెస్
అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందనేది చాలా కాలం నుంచి వినిపిస్తున్న విమర్శ. దీనిపై విచారణ జరిపితే టీడీపీ కుంభకోణం, దీని వెనుక ఉన్న పెద్దల పాత్ర బయటపడుతుందని జగన్ భావించారు. అందుకే దీనిపై విచారణ కోసం కేబినెట్ సబ్ కమిటీ, సిట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా టీడీపీని ఇరుకునపెట్టాలని జగన్ భావించారు. ఈ విచారణను అడ్డుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సిట్ విచారణకు సుప్రీం అనుమతించింది. దీంతో జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్లే. సిట్ పూర్తిగా ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. దీంతో టీడీపీని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు సుప్రీం తీర్పుపై వైసీపీ, టీడీపీ భిన్నంగా స్పందించాయి. టీడీపీ నేతలందరిపై అనేక రకాలుగా కేసులు పెట్టి ఇప్పటికే వైసీపీ వేధిస్తోందని, కొత్తగా సిట్ వేసి ఏం ప్రయోజనం అని టీడీపీ వ్యాఖ్యానించింది. నాలుగేళ్లైనా తమను ఏం చేయలేకపోయారని, తమ అవినీతిని నిరూపించలేకపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలు తమ విజయమని చెప్పుకొంది వైసీపీ. అంతేకాదు.. చంద్రబాబుతోపాటు పలువురు నేతల అరెస్టు ఖాయమని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టు తప్పదా?
సిట్ విచారణ ద్వారా చంద్రబాబు అవినీతిని నిరూపించి, అవసరమైతే బాబును అరెస్టు చేయాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ దిశగానే జగన్ పావులు కదుపుతున్నారు. అమరావతి భూ స్కాంతోపాటు, ఫైబర్‌నెట్ స్కిల్ డెవలప్‌మెంట్, పోలవరం వంటి వాటిపై సిట్ దర్యాప్తు జరుపుతుంది. వీటిలో చంద్రబాబు అవినీతి ఉందని జగన్ నమ్ముతున్నారు. దీంతో సిట్ దర్యాప్తు ద్వారా చంద్రబాబును అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. జగన్ అసలు లక్ష్యం కూడా ఇదే అని తెలుస్తోంది. ఇదే జరిగితే రాజకీయంగా సంచలనమే అవుతుంది. అసలే మరో ఏడాదిలో ఎన్నికలున్న వేళ చంద్రబాబు అరెస్టు అయితే, అది సమూల మార్పులకు దారితీస్తుంది. సిట్ విచారణ ఎలా జరుగుతుంది? టీడీపీకి చెందిన ఏయే నేతలపై కన్నేశారు? అనేది త్వరలో తేలుతుంది. సిట్ విచారణ సాగుతున్నంతకాలం చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తడం మాత్రం ఖాయం. తాజా రాజకీయాలు సిట్ చుట్టూనే తిరుగుతాయి.