TDP-BJP: బీజేపీతో పొత్తు ఉంటే మన పని ఫినిష్.. చంద్రబాబుకి సీనియర్ల వార్నింగ్

బిజెపిని కలుపుకొని వెళ్తే వైసిపి నెత్తిన పాలు పోసినట్లే. కచ్చితంగా జనం టిడిపికి వ్యతిరేకంగా ఓటేస్తారు. బిజెపితో పొత్తు పెట్టుకోకపోతే.. వైసిపికి బిజెపి నైతిక మద్దతు ఉంటుంది. అన్ని రకాల సహకారం ఉంటుంది. టిడిపి పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది.

  • Written By:
  • Publish Date - January 1, 2024 / 08:04 PM IST

TDP-BJP: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి అయోమయంగా ఉంది. ఎన్నికల్లో బిజెపితో వెళ్లాలా.. వద్దా.. అన్నది తేల్చుకోలేక పోతోంది. ఇంకా బీజేపీ వైపు నుంచి కూడా పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. సంక్రాంతి తర్వాతే రెండు పార్టీలు ఒక అవగాహనకి వచ్చే అవకాశం ఉంది. నిజానికి బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే.. ఒక సమస్య, వెళ్లకపోతే మరో సమస్య వచ్చే ప్రమాదం ఉంది. బిజెపిని కలుపుకొని వెళ్తే వైసిపి నెత్తిన పాలు పోసినట్లే. కచ్చితంగా జనం టిడిపికి వ్యతిరేకంగా ఓటేస్తారు. బిజెపితో పొత్తు పెట్టుకోకపోతే.. వైసిపికి బిజెపి నైతిక మద్దతు ఉంటుంది. అన్ని రకాల సహకారం ఉంటుంది. టిడిపి పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది.

Rakul Preet Singh: పెళ్లి కళ.. ప్రియుడితో రకుల్ డెస్టినేష‌న్ వెడ్డింగ్..!

బిజెపిలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న ఏపీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరి, పురందేశ్వరితో పాటు మరికొందరు నేతలు మాత్రం టిడిపితో పొత్తు పెట్టుకోవాల్సిందేనని బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. పొత్తు లేకపోతే ఒక్క సీటు కూడా గెలవలేమని, రాష్ట్రంలో వైసిపి పని అయిపోయిందనీ.. అందువల్లే టిడిపి, జనసేనతో కలిసి వెళ్లడమే మంచిదని వీళ్లు బిజెపి హైకమాండ్‌కి చెప్తున్నారు. బిజెపి అధినేతలు మాత్రం ఇప్పటివరకు నోరు మెదపలేదు. పైగా అయోధ్య కార్యక్రమం పూర్తయ్యే వరకు అగ్రనేతలంతా బిజీగా ఉంటారు. అంతేగాక ఏపీ కోసం టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. అక్కడ వచ్చేది కూడా ఏమీ లేదని బిజెపి హైకమాండ్‌కు స్పష్టంగా తెలుసు. ఏపీలో అన్ని పార్టీలు తమ చెప్పు కింద రాయి లాగా ఉండాల్సిందే.. కాబట్టి ఆ 25 ఎంపీ సీట్లు ఎటూ పోవు.. అన్నది బిజెపి అధిష్టానం ఆలోచన. పనిలో పనిగా కొందరు ఏపీ బీజేపీ నేతలు మీడియాకి లీకులు ఇచ్చి బ్రేకింగ్ న్యూస్‌లు, లైవ్ డిబేట్‌లు పెట్టిస్తున్నారు. బిజెపికి 25 ఎమ్మెల్యేలు, ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడానికి టిడిపి అంగీకరించిందని ఫేక్ న్యూస్‌లు చానల్స్‌లో నడుపుతున్నారు. ఇప్పటివరకు సీట్ల సర్దుబాటుకు సంబంధించి బిజెపి, టిడిపి ఎలాంటి నిర్ణయానికి రాలేదు.

TOLLYWOOD: పెళ్లిళ్ల నామ సంవత్సరం.. టాలీవుడ్‌లో ఈ ఏడాది పెళ్లి చేసుకోబోయేదెవరు..?

బిజెపి తాను పొత్తు పెట్టుకుంటానని ముందుకు వస్తే మాత్రం.. టిడిపి పని అయిపోయినట్లే. ఇదే విషయాన్ని సీనియర్ నేతలు చంద్రబాబు దగ్గర చర్చకు పెట్టారు. బిజెపిపై ఏపీలో చెప్పలేనంత వ్యతిరేకత ఉందనీ.. మరోవైపు కాంగ్రెస్ ఈసారి ప్రత్యేక హోదా అజెండాతోనే ఎన్నికల బరిలో దిగుతోదనీ.. షర్మిలని ప్రచారంలో దించి ఇదే అంశాన్ని పబ్లిక్ అజెండా చేయబోతుందనీ.. దీనివల్ల బిజెపిపై జనంలో ఇంకా వ్యతిరేకత పెరుగుతుందని సీనియర్లు చంద్రబాబుకి చెప్తున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకోక తప్పనిసరి పరిస్థితి వస్తే.. తెలివిగా తప్పించుకుంటేనే మంచిదనీ.. గెలిచిన తర్వాత ఎంపీ సీట్లు అన్ని బిజెపికి ఇస్తామని చెప్పి.. ఎన్నికల వరకు జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుని వెళ్తే అందరికీ మేలు జరుగుతుందని పార్టీలో సీనియర్లు చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వాదన మరోరకంగా ఉంది. ఏదో విధంగా తాను బిజెపి నేతలను ఒప్పించి మూడు పార్టీల కూటమి ఏర్పాటు చేస్తాననీ.. బిజెపితో పొత్తు ఉండేటట్లుగా తాను నూటికి నూరు శాతం కృషి చేస్తానని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. బిజెపిగనక పొత్తు అంగీకరిస్తే టిడిపి ఆత్మహత్య చేసుకున్నట్టేనని.. బిజెపిని కలుపుకుంటే ఏపీలో వైసీపీ చాలా తేలిగ్గా గెలిచిపోతుందని టిడిపి పెద్దలు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు.

పొత్తుకు బిజెపి దూరంగా ఉంటే టిడిపి బతికి బయట పడినట్లేనని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. బిజెపి కూడా అసలు ఇప్పుడు ఆ విషయంపై దృష్టి పెట్టే పరిస్థితిలో లేదు. మొదట ఉత్తరాది అంతా చక్కబెట్టుకోవాలి. తర్వాత దక్షిణాదిపై దృష్టి పెట్టాలి. ఏపీలో మూడు పార్టీలు బహిరంగంగానూ.. రహస్యంగానూ.. తమ కంట్రోల్లోనే ఉంటాయి కనుక ఏపీ కోసం టైమ్ వేస్ట్ చేయడం ఎందుకనే భావంలో ఉంది బిజెపి అధిష్టానం.