TDP SENIORS: సీటు గోవిందా.. టీడీపీలో సీట్ల సిగపట్లు.. సీనియర్లకీ టిక్కెట్లు డౌటే

ఓ వైపు పొత్తులతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు వైసీపీ నుంచి చేరికలు కూడా టీడీపీ లీడర్లలో టెన్షన్ కలిగిస్తున్నాయి. ఎన్నో యేళ్ళుగా పార్టీని నమ్ముకొని ఉన్న చాలామంది తెలుగు తమ్ముళ్ళకు ఇప్పుడు టిక్కెట్లు రావడం డౌటే అంటున్నారు.

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 06:06 PM IST

TDP SENIORS: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేనతో పొత్తుతో టీడీపీ సీనియర్ నేతలకు సీట్ల గండం పొంచి ఉంది. రెండు పార్టీలు కలిపి 40 దాకా అసెంబ్లీ సీట్లు, 8 లోక్‌సభ స్థానాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో టీడీపీ సీనియర్లలో ఎవరికి టిక్కెట్ వస్తుందో.. ఎవరికి రాదో తెలియని పరిస్థితి ఉంది. ఓ వైపు పొత్తులతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు వైసీపీ నుంచి చేరికలు కూడా టీడీపీ లీడర్లలో టెన్షన్ కలిగిస్తున్నాయి. ఎన్నో యేళ్ళుగా పార్టీని నమ్ముకొని ఉన్న చాలామంది తెలుగు తమ్ముళ్ళకు ఇప్పుడు టిక్కెట్లు రావడం డౌటే అంటున్నారు. ఉమ్మడి తూర్పు, విశాఖ జిల్లాల్లో టీడీపీ నేతలకు ఈ టెన్షన్ మరింత ఎక్కువగా ఉంది.

BJP DEMANDS TDP: చంద్రబాబు పాట్లు.. ఇస్తావా.. చస్తావా! బాబుకు బీజేపీ హుకుం

ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కాపులు, జనసేన కార్యకర్తలు ఎక్కువగా ఉండటంతో.. వీలైనన్ని సీట్లు ఇక్కడే కోరుతున్నారు పవన్ కల్యాణ్. ఆయన భీమవరం నుంచే మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని టీడీపీ, జనసేన కార్యకర్తలకు స్పష్టం చేశారు. స్థానికంగా ఉండేందుకు ఓ ఇల్లు కూడా వెతుకుతున్నారు పవన్ కల్యాణ్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని అడుగుతోంది జనసేన. గత నెలలో రాజానగరం, రాజోలు స్థానాల్లో పోటీ చేస్తామని కూడా పవన్ ప్రకటించారు. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ నుంచి జనసేన నేత కందుల దుర్గేష్‌కు టిక్కెట్ ఇస్తారని అంటున్నారు. దుర్గేష్ స్వయంగా ప్రకటించడంతో.. టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇక్కడ పోటీలో ఉన్న టీడీపీ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భవిష్యత్తు ఏంటనే చర్చ మొదలైంది. ఈ వార్తలతో పరేషాన్ అయిన బుచ్చయ్య చౌదరి.. తాను పోటీలోనే ఉన్నట్టు ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆదేశాలు పాటిస్తాననీ.. కార్యకర్తలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు అసెంబ్లీ, ఓ పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.

BRS-KCR: బీఆర్ఎస్‌ నీటి పోరు యాత్ర.. హైదరాబాద్‌లో భారీ సభకు ప్లాన్

జనసేన కోరే 4 స్థానాల్లోనూ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. మాజీ మంత్రులు అయ్యన్న, గంటా, బండారుకు సీట్లపై ఇంకా క్లారిటీ రాలేదు. విశాఖ సౌత్‌ కోసం టీడీపీ నుంచి గండిబాబ్జీ పోటీలో ఉన్నారు. సౌత్ సీటును గత రెండు సార్లు టీడీపీయే గెలిచింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరారు. అయినా టీడీపీ క్యాడర్ చెక్కు చెదరలేదు. కానీ ఈ సీటును జనసేన అడుగుతోంది. పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సీటు కోరుతోంది జనసేన. ఈ సీటు కోసమే వైసీపీని వీడి జనసేనలోకి వచ్చారు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. దాంతో పెందుర్తి సీటుపై బండారుకి క్లారిటీ లేకుండా పోయింది. భీమిలి నుంచి మరోసారి పోటీకి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రెడీ అవుతున్నారు. అయితే ఇదే సీటు కావాలంటోంది జనసేన. భీమిలీలో పోటీకి ఆసక్తిగా ఉన్నారు ఎమ్మెల్సీ వంశీ. మరోవైపు.. చీపురుపల్లి నుంచి గంటా పేరుతో టీడీపీ IVRS సర్వే నిర్వహిస్తుండటంతో గందరగోళం ఏర్పడింది. గాజువాకలో జనసేన, టీడీపీలో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ రాలేదు. ఇక్కడ బలమైన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నారు. యాదవులకు అవకాశం అంటే పల్లా సీట్ సేఫ్. కానీ గాజువాకలో మరోసారి పోటీకి జనసేన ఆసక్తి చూపిస్తోంది.

పల్లాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే ఎంపీగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వైజాగ్ ఎంపీ సీటు పొత్తులో బీజేపీకి వెళుతుందని అంచనాలు ఉన్నాయి. బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్‌కు అక్కడి నుంచి ఎంపీ టిక్కెట్ వస్తుందా రాదా అన్నది డౌట్‌గా మారింది. ఒకవేళ బీజేపీకి ఇస్తే మాత్రం.. శ్రీభరత్ రాజమండ్రికి షిఫ్ట్ అయ్యే అవకాశముంది. అనకాపల్లి ఎంపీగా పోటీచేయడానికి మాజీ మంత్రి కొణతాల ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇక్కడ నాగబాబు పోటీ ఖాయమంటోంది జనసేన వర్గం. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకీ సీట్ల పంచాయితీ తప్పడం లేదు. ఆయన కొడుకు విజయ్‌కు MP ఛాన్స్ అడుగుతున్నారు. కానీ అయ్యన్నకే అవకాశమని తేల్చేసింది టీడీపీ హైకమాండ్. మరోవైపు మంత్రి బొత్సను ఎదుర్కోడానికి సీనియర్ల కోసం టీడీపీ సెర్చింగ్ చేస్తోంది. ఇంకా చాలా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన అభ్యర్థులు టిక్కెట్లు ఆశిస్తున్నారు. టీడీపీ సీనియర్లు కూడా సీట్ల కోసం సిగపట్ల పట్టాల్సి వస్తోంది.