Singareni polls: సింగరేణి ఎన్నికలకు రేవంత్ సర్కార్ భయపడుతోందా..?

ఎన్నికల వాయిదా కోసం కోర్ట్‌కెక్కింది కాంగ్రెస్‌ సర్కార్‌. మార్చి దాకా ఎలక్షన్స్‌ని వాయిదా వేయాలంటూ హైకోర్ట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది కోర్ట్‌. దీంతో 27న పోలింగ్‌ జరుగుతుందా లేదా అన్న విషయంలో సందిగ్ధత పెరుగుతోంది.

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 02:58 PM IST

Singareni polls: తెలంగాణలోని ఆరు జిల్లాలు, 11 ఏరియాల్లో విస్తరించి ఉంది సింగరేణి. ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాల్సి ఉంది. వివిధ కార్మిక సంఘాలు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నాయి. మొత్తం 39వేల మంది ఓటేయాల్సి ఉంది. సీన్‌ కట్‌ చేస్తే.. ఇప్పుడు ఎన్నికల వాయిదా కోసం కోర్ట్‌కెక్కింది కాంగ్రెస్‌ సర్కార్‌. మార్చి దాకా ఎలక్షన్స్‌ని వాయిదా వేయాలంటూ హైకోర్ట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది కోర్ట్‌. దీంతో 27న పోలింగ్‌ జరుగుతుందా లేదా అన్న విషయంలో సందిగ్ధత పెరుగుతోంది.

PAWAN KALYAN: తిరుపతి నుంచి బరిలో దిగుతున్న పవన్ కళ్యాణ్

పేరుకు కార్మిక సంఘ ఎన్నికలైనా జనరల్‌ ఎలక్షన్స్‌ రేంజ్‌లో జరుతుండటంతో హోరాహోరీగా తలపడుతున్నాయి వివిధ పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు. ఈ పరిస్థితుల్లో కోర్టు విచారణ కారణంగా ఎన్నిక ఉంటుందా.. ఉండదా..? ప్రచారం చేయాలా..? వద్దా..? అన్న అయోమయంలో పడిపోయారట కార్మిక నేతలు. అదంతా ఒక ఎత్తయితే.. ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఇంధన శాఖ కార్యదర్శి కోర్ట్‌కు వెళ్ళడమేంటన్న చర్చ జరుగుతోంది. కాస్త లోతుల్లోకి వెళ్తే.. ముందే సింగరేణి ఎలక్షన్స్‌ని జరిపించాలనుకున్నా.. అంతలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో అది వాయిదా పడింది. తీరా ఎలక్షన్స్‌ తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అటు సింగరేణిలో సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ, బీఆర్‌ఎస్‌ అనుబంధం సంఘం టీబీజీకేఎస్‌ బలంగా ఉన్నాయి. కానీ వాటితో పోల్చుకుంటే.. కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీకి ఇక్కడ అంత బలం లేదన్నది కార్మిక వర్గాల మాట. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగి తమ సంఘం ఓడిపోతే.. ఆ ప్రభావం ఆరు జిల్లాల్లో పార్టీ మీద ఉంటుందని, అందుకే కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలికంగా వాయిదా వేయించే ప్రయత్నంలో ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం కాబట్టి.. టైం తీసుకుని సింగరేణిలో కార్మిక సంఘాన్ని బలోపేతం చేసుకుందామన్నది కూడా కాంగ్రెస్‌ పెద్దల వ్యూహం అయి ఉండవచ్చంటున్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అంటున్నారు పరిశీలకులు. సంస్థలో పట్టు బిగించాకే ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే చేరికలపై ప్రత్యేక దృష్టిపెట్టడంతోపాటు ఐఎన్‌టీయూసీకి పూర్వ వైభవం తెచ్చేలా ప్లాన్ అవుతోందట. అధికారంలోకి వచ్చి నెల గడవకముందే.. సింగరేణి ఎన్నిక రూపంలో దెబ్బ పడితే కష్టం గనుక వాయిదా అంశాన్ని తెరమీదికి తెచ్చినట్టు తెలిసింది. పైగా రాష్ట్రానికి అతి పెద్ద ఆదాయ వనరు సింగరేణి కావడం, ఆరు జిల్లాల్లో రాజకీయంగా చక్రం తిప్పే అవకాశం ఉండటంతో.. ఆ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకూడదని అనుకుంటోందట అధికార పార్టీ. కారణం ఏదైనా.. మొత్తంగా సింగరేణి ఎన్నికల వ్యవహారం ఇప్పుడు కోర్ట్‌కు చేరింది. దీంతో 21న ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది కార్మిక వర్గాల్లో.