TELANGANA CONGRESS: తెలంగాణలో సలహాదారుల నియామకం.. నలుగురికి ఛాన్స్.. ఎవరంటే

ఈ నలుగురిలో సీఎం రేవంత్‌కు వ్యక్తిగతంగా ఒక సలహాదారు, ప్రభుత్వానికి ముగ్గురు సలహాదారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ నలుగురికి కేబినెట్‌ హోదా కల్పిస్తున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది.

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 05:09 PM IST

TELANGANA CONGRESS: తెలంగాణలో నలుగురికి సలహాదారులుగా అవకాశం దక్కింది. నలుగురిని సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అనిలీ, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవిని, ప్రోటోకాల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్‌కు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా హెచ్.వేణుగోపాల్ రావును ప్రభుత్వం నియమించింది.

YS SHARMILA: ఏపీకి ప్రత్యేక హోదా ఏది.. జగన్ పాలనంతా దోచుకోవడమే: వైఎస్ షర్మిల

ఈ నలుగురిలో సీఎం రేవంత్‌కు వ్యక్తిగతంగా ఒక సలహాదారు, ప్రభుత్వానికి ముగ్గురు సలహాదారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ నలుగురికి కేబినెట్‌ హోదా కల్పిస్తున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది. వీరిలో వేం నరేందర్ రెడ్డి.. సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితుడు. పలు సందర్భాల్లో ఒకరికోసం ఇంకొకరు నిలబడ్డారు. అందుకే ఆయనను సీఎం రేవంత్.. తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే ఇద్దరికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. మహేశ్‌ కుమార్‌ గౌడ్, బల్మూరి వెంకట్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. వీరి ఎంపిక దాదాపు ఖాయం.

కోదండరాం వంటి వ్యక్తులకు కూడా ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించనుంది. మిగతా నామినేటెడ్ పదవులపై కూడా కసరత్తు కొనసాగుతోంది. ఆర్టీసీ ఛైర్మన్‌ సహా మరికొన్ని కీలక పదవులకు ఇప్పటికే కీలక నేతలను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్, లండన్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఆ పేర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చాలా మంది నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు.