Vijayashanti: రాములమ్మ ఎక్కడ..? పొలిటికల్‌ సీన్‌లో కనిపించని విజయశాంతి.. పట్టించుకోని కాంగ్రెస్..

చాలా విషయాల్లో ఆమె అసలు ఎందుకు ఆవేశపడుతుందో.. దేనికి ఆవేశపడుతుందో కూడా జనానికి అర్థం కాదు. మొత్తం మీద దేశంలో అన్ని పార్టీలు తిరిగివచ్చేసిన ఒకప్పటి లేడీ.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో విశ్రాంత జీవితం గడుపుతోంది.

  • Written By:
  • Updated On - April 4, 2024 / 06:39 PM IST

Vijayashanti: సినిమాల్లో ఆమె ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ హీరోయిన్. పాలిటిక్స్‌లో మాత్రం ఎక్స్‌స్ట్రా ఆర్టిస్ట్. తన వల్లే తెలంగాణ వచ్చిందని అనుకుంటూ ఉంటుంది. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వెలిగిపోతోందని.. అది కూడా తన వల్లే వెలిగిపోతుందని.. ఆమె విపరీతంగా ఫీలవుతూ ఉంటుంది. చాలా విషయాల్లో ఆమె అసలు ఎందుకు ఆవేశపడుతుందో.. దేనికి ఆవేశపడుతుందో కూడా జనానికి అర్థం కాదు. మొత్తం మీద దేశంలో అన్ని పార్టీలు తిరిగివచ్చేసిన ఒకప్పటి లేడీ.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో విశ్రాంత జీవితం గడుపుతోంది.

K KAVITHA: కవిత బెయిల్‌పై నో రిలీఫ్.. తీర్పు ఈనెల 8కి వాయిదా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయశాంతి స్టార్‌డమ్ వేరు. అయితే అదంతా 90లతోనే పోయింది. అదే స్టార్‌డమ్‌ తనకు పాలిటిక్స్‌లోనూ కంటిన్యూ అవుద్దన్న ఆశతో రాములమ్మ 1998లో మొదట బీజేపీలో చేరింది. కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హయాంలో విజయశాంతి బీజేపీలో చేరారు. అంతకుముందు 1996లోనే తమిళనాడులో అన్నాడీఎంకేకి స్టార్ క్యాంపైనర్‌గా కూడా చేశారు విజయశాంతి. ఆ సమయంలో జయలలితకి బాగా దగ్గరయ్యారు. 1999 ఎన్నికల్లో సోనియాగాంధీ కడప నుంచి ఎంపీగా పోటీ చేయవచ్చనే ప్రచారం జరగడంతో.. ఆమెకు వ్యతిరేకంగా అక్కడి నుంచి విజయశాంతిని పోటీకి నిలబెట్టాలని బీజేపీ భావించింది. ఐతే సోనియా బళ్లారి నుంచి పోటీ చేయడంతో.. విజయశాంతి కడప నుంచి విరమించుకుంది. తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న టైంలో.. 2005లో ఆమె ఏకంగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. సైద్ధాంతికంగా ఏమీ తెలియక పోవడం, స్వతహాగా పెద్ద విషయం లేకపోవడంతో.. తెలంగాణలో ఆమె సొంత రాజకీయం పెద్దగా నడవలేదు. వరంగల్ జిల్లా నుంచి తాను వచ్చానని చెప్పుకోవడమే తప్ప ఆధారాలు కూడా లేవు. విజయశాంతి చుట్టూ ఉండే చిడతల బ్యాచ్, పదో పరకో తీసుకుంటూ ఆమెను నిత్యం ఆకాశానికి ఎత్తివేస్తూ ఉండేవారు.

టీఆర్ఎస్‌లో పార్టీ విలీనం..

విజయశాంతి కూడా తాను నిజంగానే చాలా ఉద్యమభావాలు, రాజకీయ పరిపక్వత ఉన్న నేతననే భావనలోనే కొట్టుకుపోతూ ఉండేవారు. దీనికి తోడు ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కూడా వీలైనంత వరకు విజయశాంతిని అదే భ్రమల్లో ఉంచేవారు. మొత్తం మీద సొంత పార్టీ నడపడం చాలా కష్టమని తెలుసుకొని.. 2009లో తల్లి తెలంగాణను టీఆర్ఎస్‌లో కలిపేశారామె! ఆ తర్వాత మెదక్ ఎంపీగా టీఆర్ఎస్‌ నుంచి ఎన్నికయ్యారు. 2011లో కేసీఆర్‌తో కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాకపోతే ఆమె రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి సేవల్ని బాగానే వినియోగించుకున్నారు కేసీఆర్. కానీ ఆమెకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం మాత్రం ఇవ్వకుండా, ఎక్కడా ఆమెకు పేరు రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. ఇది గుర్తించిన విజయశాంతి అడ్డం తిరిగారు. ఉనికి కోసం అప్పుడప్పుడు సొంత గొంతు వినిపించేవారు. పార్టీకి, విజయశాంతికి మధ్య దూరం పెరిగింది.

BRS VASTU: బీఆర్ఎస్ ఓడింది అందుకేనా..? వాస్తు మార్పుతో ఇక తిరుగులేదా..!

విజయశాంతి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్.. పటాన్ చెరువులో ల్యాండ్ స్కాంకి పాల్పడ్డారని, మాజీ సైనికుల భూముల్ని మింగేశారని.. టీఆర్ఎస్‌ పార్టీ నుంచి లీకులు వచ్చాయ్. 2013లో విజయశాంతి టిఆర్ఎస్ మంచి సస్పెండ్ అయ్యారు. 2014లో తెలంగాణ సాకారం అయినప్పుడు మాత్రం ఆమె లోక్‌సభలో ఉన్నారు. విజయశాంతి జీవితానికి ఆ సందర్భం ఒక్కటే చాలా గొప్ప జ్ఞాపకం. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాను ఎప్పటికీ స్టార్‌డమ్‌ ఉన్న సెలబ్రిటీనేనని ఆమె తరచూ ఫీల్ అవుతూ ఉంటారు. దీంతో రోజువారి పొలిటికల్ లీడర్స్‌తో ఆమె కలవలేకపోయేవారు. 2018, 19 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా చేశారు విజయశాంతి. ఆ సమయంలో మోడీని భయంకరమైన టెర్రరిస్ట్ అని డైరెక్ట్‌గా కామెంట్ చేశారు కూడా! ఎన్ని చేసినా కాంగ్రెస్‌లోనూ పెద్ద గుర్తింపు లేకపోవడంతో.. 2020లో ఆమె బీజేపీ పంచన చేరారు.

కాంగ్రెస్ నుంచి బీజేపీ.. బీజేపీ నుంచి కాంగ్రెస్

మోడీ మార్క్ బీజేపీలోనూ విజయశాంతిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ 2023లో.. అంటే నాలుగు నెలల కింద మళ్లీ కాంగ్రెస్‌కి వచ్చి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లోను, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోను విజయశాంతికి సీట్ ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు కానీ.. పెద్దగా పార్టీకి ప్రచారం చేసింది కూడా ఏం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో ఆమెను పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఇక్కడ ఎవడి ఉనికి వాడే ఎత్తుకోవాలి. ఇంకా తాను స్టార్ సెలబ్రిటీని అనే ఊహల్లోనే విజయశాంతి ఉండిపోయారు. దీంతో అటు సినిమా ఇండస్ట్రీ.. ఇటు పొలిటికల్ సిస్టమ్.. విజయశాంతిని మర్చిపోయింది.

ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా అంటే అదీ లేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ పొలిటికల్‌గా తనకంటూ అడ్రస్ లేకుండా నడిపించేస్తున్నారు ఒకప్పటి స్టార్ రాములమ్మ. ప్రభుత్వ కార్యక్రమాలు ఎలాగూ లేవు.. కనీసం పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. అధిష్టానం పిలవను లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేసి అడిగితే కేసీఆర్‌ని గద్దె దింపాలి అనుకున్నాను. దింపేశాను. నా లక్ష్యం పూర్తయిందని చాలా ఇంటలెక్చువల్‌గా సమాధానం చెప్పేస్తున్నారు విజయశాంతి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంతకన్నా చెప్పడానికి ఇంకేమీ ఉండదు!