పవన్‌ మనసు గెలిచిన సర్పంచ్‌.. ఎవరీమె.. అంత స్పెషల్‌ ఏంటి ?

ఏపీవ్యాప్తంగా 13వేలకు పైగా పంచాయతీల్లో గ్రామసభలు జరిగాయ్‌. ఒకేరోజు ఈస్థాయిలో గ్రామసభల నిర్వహణ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. స్వయంగా ఈ సంబరంలో పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - August 23, 2024 / 08:45 PM IST

ఏపీవ్యాప్తంగా 13వేలకు పైగా పంచాయతీల్లో గ్రామసభలు జరిగాయ్‌. ఒకేరోజు ఈస్థాయిలో గ్రామసభల నిర్వహణ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. స్వయంగా ఈ సంబరంలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లె గ్రామానికి వెళ్లారు. స్థానిక సర్పంచ్ కారుమంచి సంయుక్త మీద పవన్ ప్రశంసలు కురిపించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఆమె విజయం తనను కదిలించిందంటూ చెప్పుకొచ్చారు.

దీంతో ఎవరీ కారుమంచి సంయుక్త అనే విషయం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీలో 2021లో పంచాయతీ ఎన్నికలు జరిగాయ్‌. ఈ ఎలక్షన్స్‌లో చాలాచోట్ల దాడులు, హింసాత్మక ఘటనలు జరిగాయ్‌. దీంతో చాలాచోట్ల ప్రత్యర్థి పార్టీ తరఫున పోటీకి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎక్కువ స్థానాల్లో ఏకగ్రీవాలు కనిపించాయ్. ఐతే ఇలాంటి పరిస్థితుల్లోనూ రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె పంచాయతీ సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో… జనసేన తరఫున కారుమంచి సంయుక్త పోటీ చేశారు. పోటీ చేయడమే కాదు… ఒత్తిళ్లకు తలొగ్గకుండా బరిలో నిలిచి విజయం సాధించారు.

దీంతో ఆమె ధైర్యాన్ని పవన్ ప్రశంసించారు. అప్పట్లో ఎన్నికల సమయంలో రోడ్డుమీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదన్న పవన్.. అలాంటి పరిస్థితుల్లోనూ నిలబడి సంయుక్త విజయం సాధించారని కొనియాడారు. కారుమంచి సంయుక్త బ్యాక్‌గ్రౌండ్ తెలిసి ప్రతీ ఒక్కరు అవాక్కవుతున్నారు. సంయుక్త భర్త మిలిటరీలో పనిచేసేవారు. దురదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఐతే భర్త చనిపోయినా కూడా.. ఆయన ఆశయాలను సాధించేందుకు కారుమంచి సంయుక్త పంచాయతీ ఎన్నికల్లో పోటీచేశారు. ఒత్తిళ్లు, బెదిరింపులను కూడా లెక్కచేయక బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ విషయం నిజంగా తన గుండెను కదిలించిందన్న డిప్యూటీ సీఎం.. సంయుక్త పట్టుదలతో ఇలాంటి మహిళలు రాజకీయాల్లో ఉండాలని.. రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.