Pawar – Adani : మస్త్‌ మస్త్‌గా మహారాష్ట్ర రాజకీయం…! పవార్‌తో అదానీ మంతనాల వెనుక…!

మహారాష్ట్ర రాజకీయం ఆసక్తిని రేపుతోంది. రోజుకో పొలిటికల్ ట్విస్ట్‌తో మహానాటకాన్ని రక్తికట్టిస్తున్నారు నేతలు. ఎన్సీపీలో చీలిక వార్తలు మరవక ముందే ఇప్పుడు పవార్‌తో అదానీ భేటీ కలకలం రేపుతోంది. ఈ మీటింగ్‌ దేశ పాలిటిక్స్‌ను టర్న్ చేస్తాయా అన్న అనుమానాలు రేగుతున్నాయి. అసలు పవార్‌- అదానీ మీటింగ్‌లో ఏం జరిగింది...?

  • Written By:
  • Publish Date - April 20, 2023 / 07:42 PM IST

మహారాష్ట్ర రాజకీయం ఆసక్తిని రేపుతోంది. రోజుకో పొలిటికల్ ట్విస్ట్‌తో మహానాటకాన్ని రక్తికట్టిస్తున్నారు నేతలు. ఎన్సీపీలో చీలిక వార్తలు మరవక ముందే ఇప్పుడు పవార్‌తో అదానీ భేటీ కలకలం రేపుతోంది. ఈ మీటింగ్‌ దేశ పాలిటిక్స్‌ను టర్న్ చేస్తాయా అన్న అనుమానాలు రేగుతున్నాయి. అసలు పవార్‌- అదానీ మీటింగ్‌లో ఏం జరిగింది…?

ముంబయిలోని శరద్‌పవార్‌ నివాసం సిల్వర్‌ఓక్‌కు వచ్చిన పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ దాదాపు రెండు గంటల పాటు అక్కడే గడిపారు. ఇద్దరూ ఏకాంతంగా సుదీర్ఘ చర్చలు జరపడం ఆసక్తిని రేపుతోంది. ఇటీవలే అదానీకి శరద్‌పవర్‌ తన ఫుల్‌సపోర్ట్ ప్రకటించారు. తన మిత్రపక్షం కాంగ్రెస్… అదానీని అడ్డుపెట్టుకుని ప్రధాని మోడీతో పోరాడుతున్న సమయంలో ఈ మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం అందుకు భిన్నమైన వైఖరిని ఎంచుకోవడం ఆసక్తిని రేపింది. అదానీ ఆర్థిక అవకతవకలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని కూడా ఆయన వ్యతిరేకించారు. అందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే అదానీ…పవార్ నివాసానికి వచ్చారని ఇరువర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పడం ద్వారా వేరే ఎదో ఉందని చెప్పకనే చెప్పాయి. 2014లో ఇలాగే అదానీ,పవార్‌ భేటీ అయ్యారు. ఆ వెంటనే మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈసారి కూడా అలాంటిదేదో జరగబోతోందని మహా పొలిటికల్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి.

ప్రస్తుతం మహారాష్ట్ర పాలిటిక్స్‌ క్రాస్‌రోడ్స్‌లో ఉన్నాయి. ఎవరు ఎవరికి మిత్రపక్షమో అర్థంకాని పరిస్థితి నెలకొంది. శివసేనను చీల్చిన ఏక్‌నాథ్‌షిండే బీజేపీతో జట్టుకట్టారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌, ఉద్దవ్‌వర్గం కలిసే ఉన్నాయని భావించినా… సావర్కర్‌పై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ఉద్దవ్‌ వర్గానికి ఇబ్బందిగా మారాయి. రాహుల్‌పై డైరెక్ట్‌ ఎటాక్‌కు దిగారు ఉద్దవ్‌థాక్రే. కాంగ్రెస్‌ను కాదని అదానీకి మద్దతివ్వడం ద్వారా పవార్‌ కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఆయనపై బీజేపీ నేతల పొగడ్తలు చూస్తుంటే ఏదో జరుగుతోందన్న అనుమానాలు రేగాయి.

ఈ తలనొప్పుల మధ్య మరో పొలిటికల్‌ డెవలప్‌మెంట్‌ మహారాష్ట్రలో కలకలం రేపింది. ఎన్సీపీలో ముసలం పుట్టిందని, అజిత్‌పవార్‌ పార్టీని చీల్చి బీజేపీతో జట్టు కట్టబోతున్నారన్న వార్త మహా పాలిటిక్స్‌ను కుదిపేసింది. కొంతమంది ఎమ్మెల్యేలతో ఆయన పార్టీని వీడుతున్నారని చెప్పుకున్నారు. అయితే దీనిపై ఏక్‌నాథ్‌షిండే వర్గం వెంటనే రియాక్టైంది. అజిత్‌పవార్‌ బీజేపీతో జట్టు కడితే తాము ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని ప్రకటించింది. అజిత్‌పవార్‌కు అక్కడ స్వేచ్ఛ లేదని ఆయన బయటకు రావడానికి అదే కారణమవ్వొచన్నది శివసేన వాదన. అయితే ఈ వార్తలను అజిత్‌పవార్ ఖండించారు. బతికున్నంత కాలం ఎన్సీపీ కోసమే పనిచేస్తానని ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ సమయంలో పవార్‌ కుమార్తె సుప్రీయాసూలే రాష్ట్రంలో మరో రెండు భూకంపాలు చూడబోతున్నామని చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. మొత్తంగా చూస్తే పవార్‌ బీజేపీకి దూరమైనట్లే కనిపిస్తోంది. అజిత్‌పవార్‌ వివాదం సద్దుమణిగేలోగా ఇప్పుడు అదానీ ఎంట్రీ అనుమానాలు రేపింది.

పవార్‌ తీరుపై కాంగ్రెస్‌ ఎలా స్పందిస్తున్నది కూడా చూడాల్సి ఉంది. ఇప్పుడు ఆయన్ను దూరం చేసుకోవడం హస్తానికి మంచిది కాదు. కానీ కమలంవైపు చూస్తున్న పవార్‌ను అడ్డుకోలేని పరిస్థితి. ఆరు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న పవార్‌ను ఏమీ అనే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. మొత్తంగా మహా పరిణామాలు బీజేపీకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారన్నప్పుడు శరద్‌ పవార్‌ పేరు మొదట వినిపించింది. ఇప్పుడాయన తనంతట తానే సైడైపోయారు. దాదాపు మోడీ సైడ్ చేరిపోయారు. దీంతో ప్రతిపక్ష క్యాంప్‌ నుంచి ఓ వికెట్ పడిపోయినట్లైంది. ప్రతిపక్షాల అనైక్యతే బీజేపీకి కావాలి.