YS Sharmila: పార్టీ విలీనంపై షర్మిల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు..!

వైఎస్‌ఆర్‌ వర్థంతి సందర్భంగా షర్మిల ఇడుపులపాయ వెళ్లనున్నారు. అక్కడ వైఎస్‌ఆర్‌కు నివాళి అర్పించిన తరువాత పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఢిల్లీలో షర్మిలతో మాట్లాడిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 12:57 PM IST

YS Sharmila: వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల రెడీ అయ్యారు. సోనియాతో భేటీ అనంతరం తన ముఖ్య అనుచరులతో లోటస్‌పాండ్‌లో షర్మిల సమావేశమయ్యారు. పార్టీ విలీనంపై అసంతృప్తిగా ఉన్న నేతలను పిలిపించుకుని మాట్లాడారు. రేపు వైఎస్‌ఆర్‌ వర్థంతి సందర్భంగా షర్మిల ఇడుపులపాయ వెళ్లనున్నారు. అక్కడ వైఎస్‌ఆర్‌కు నివాళి అర్పించిన తరువాత పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఢిల్లీలో షర్మిలతో మాట్లాడిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.

త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉండటంతో ప్రచారంలో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారట. ఇక్కడ అనుకున్న స్థాయిలో రెస్పాన్స్‌ రాకపోతే వెంటనే ఏపీ రాజకీయాల్లో షర్మిలను యాక్టివ్‌ చేసే యోచనలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో జగన్‌ జైల్‌లో ఉన్న సమయంలో షర్మిల.. తన అన్న జగన్ తరపున ప్రచారం నిర్వహించారు. పాదయాత్ర చేసి వైసీపీ ఎజెండాను ఇంటింటికీ తీసుకువెళ్లారు. వైసీపీ నుంచి షర్మిలకు రాజ్యసభ ఇస్తామని చెప్పిన జగన్‌ ఆ తరువాత ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఈ విషయంలోనే జగన్‌, షర్మిల మధ్య గ్యాప్‌ వచ్చిందని పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు ఏకంగా జగన్‌కు వ్యతిరేకంగా షర్మిలను బరిలో దింపబోతోందట కాంగ్రెస్‌ పార్టీ. కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయిన నేతలను వెనక్కి తీసుకురావడంతో పాటు ఏపీలో కాంగ్రెస్‌ను బలంగా మార్చేందుకు షర్మిలను రంగంలోకి దించబోతున్నట్టు టాక్‌.

ఈ రెండు వర్కౌట్‌ అవ్వకపోతే కర్నాటక నుంచి షర్మిలకు రాజ్యసభ ఆఫర్‌ చేసేందుకు కూడా సోనియా రెడీ ఉన్నట్టు తెలుస్తోంది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. మొదటి నుంచి షర్మిలకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ఆలోచన చేసిందే శివకుమార్‌. రీసెంట్‌గా ఆయనను షర్మిల కలిసిన తరువాత విలీనం ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు షర్మిలకు వచ్చిన రాజ్యసభ సీటు ఆఫర్‌ వెనక కూడా శివకుమార్‌ హస్తం ఉంది. ఇలా.. ఎలా చూసినా కాంగ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత షర్మిల రోల్‌ తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలకంగా మారబోతోంది. అయితే షర్మిల దీని గురించి ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి మరి.