Visakhapatnam: కోడి ప్లస్ క్వార్టర్‌ బాటిల్‌.. జనాలకు వైసీపీ నేత పండగ గిఫ్ట్‌..

దసరాకు ఓ నాయకుడు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియాగా మారింది. దసరాకు స్వీట్లు, గిఫ్ట్‌లు ఇవ్వడం కామన్. దసరాకు కేజీ కోడీ, క్వార్టర్ మందు బాటిల్‌ పంచి ఔరా అనిపించారు.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 07:25 PM IST

Visakhapatnam: ఇన్నిన్ని కాదయా ఎన్నికల సిత్రాలు అంటారు. ఎన్నికల వేళ.. రాజకీయ నాయకులు చూపించే ప్రేమ మాములుగా ఉండదు. మనలో ఒకరు అంటారు.. మనతో ఒకరం అంటారు. మనకు కష్టం వస్తే వాళ్లు కన్నీరు కారుస్తారు. ఖర్చు మనది అయితే.. భరించేది తాము అంటారు. అక్కడ, ఇక్కడ అని కాదు.. ప్రతీ రాష్ట్రంలో ఎన్నికల్లో.. ప్రతీసారి కనిపించే సీన్ అదే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయ్.

తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేయగా.. ఏపీలో గట్టిగా లెక్క తీస్తే మరో ఏడునెలల సమయం మాత్రమే ఉంది. దీంతో జనాల మనసు గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే అక్కడి నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జనంలో ఉంటున్నారు. జనంలా ఉంటున్నారు. గిఫ్ట్‌లతో వల వేస్తున్నారు. అలాంటి ఘటనే జరిగింది విశాఖలో ఒకటి. దసరాకు ఓ నాయకుడు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియాగా మారింది. దసరాకు స్వీట్లు, గిఫ్ట్‌లు ఇవ్వడం కామన్. రొటీన్‌గా ఉంటే మనల్ని ఎవరు చూస్తారు.. ఎందుకు గుర్తుంచుకుంటారు అనుకున్నాడో ఏమో.. ఆ వైసీపీ నేత డిఫరెంట్‌గా థింక్‌ చేసారు. దసరాకు కేజీ కోడీ, క్వార్టర్ మందు బాటిల్‌ పంచి ఔరా అనిపించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ నాయకుడు బాపూ ఆనంద్ చేసిన ఈ పని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన బాపూ ఆనంద్ 31వ వార్డు నాయకుడు. దసరా సందర్భంగా కార్యాలయంలో కోడి, క్వార్టర్ పంపిణీ చేపట్టి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మొత్తం 122 మందికి పంపిణి చేశాడు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇందులో ఎక్కువ మంది ఆనంద్ వర్గీయులే కావడం హైలైట్. ఏమైనా.. తాయిలాలల్లో తాయిలాలు.. అద్భుతమైన తాయిలాలయ్యా అనంద్.. వాట్ యాన్ ఐడియా అంటూ.. సెటైర్లు వేస్తున్నారు ఇది చూసిన జనాలు.