YSRCP: ఆ జిల్లాలో ఒక్కర్నీ మార్చని వైసీపీ.. కారణం ఇదేనా..?

ప్రజల్లో వ్యతిరేకత ఉందని నివేదికలు అందిన పలువురు సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల్ని సైతం పక్కన బెట్టి.. నిర్ణయాలు తీసుకుంటోంది పార్టీ అధిష్టానం. పలు ఉమ్మడి జిల్లాల్లో భారీగా మార్పులు చేర్పులు జరిగాయి. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్కరు మినహా అందర్నీ మార్చేసింది.

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 07:57 PM IST

YSRCP: వచ్చే ఎన్నికల్లో గెలుపే సింగిల్‌ పాయింట్‌ అజెండాగా వైసీపీలో కసరత్తు జరుగుతోంది. ఎలాంటి మొహమాటాలకు తావులేకుండా, రిస్క్‌ తీసుకోకుండా అభ్యర్థుల ఎంపిక జరుగుతోందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటికి దాదాపు 60 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది పార్టీ హై కమాండ్‌. ప్రజల్లో వ్యతిరేకత ఉందని నివేదికలు అందిన పలువురు సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల్ని సైతం పక్కన బెట్టి.. నిర్ణయాలు తీసుకుంటోంది పార్టీ అధిష్టానం.

Kothapalli Subbarayudu: కొత్తపల్లికి టిక్కెట్ ఇచ్చేదెవరు..? ఆ తప్పులే కొంపముంచాయా..?

పలు ఉమ్మడి జిల్లాల్లో భారీగా మార్పులు చేర్పులు జరిగాయి. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్కరు మినహా అందర్నీ మార్చేసింది. ఇటు సిట్టింగ్ ఎంపీలను కూడా మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తోంది. ఇంత జరుగుతున్నా.. ఎన్ని మార్పులు చేస్తున్నా.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాత్రం అస్సలు వేలుపెట్టకపోవడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇక్కడ ఇప్పటిదాకా ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్‌గానీ.. ఎంపీ టిక్కెట్‌ విషయంలోగానీ మార్పుల దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే.. మిగతా జిల్లాలకు భిన్నంగా విజయనగరంలో సిట్టింగ్‌లు అందరి మీద ప్రజల్లో పాజిటివ్‌ దృక్పథం ఉందా? ఒక్కరి మీద కూడా వ్యతిరేకత లేదా? ఈ జిల్లా వరకు ఎన్నికల్లో యథాతధంగా కొనసాగిస్తారా? పార్టీ పెద్దలు అటే మొగ్గుతున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ, ఒక లోక సభ నియోజకవర్గం ఉన్నాయి. ఇందులో రెండు ఎస్టీ, ఒక ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఇదే జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయినాసరే.. ఈ జిల్లాను ఇప్పటి వరకు టచ్ చేయకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటన్న చర్చ మొదలైంది. విజయనగరం జిల్లాలో ఒక్కరిని కూడా మార్చవద్ధని డిసైడ్ అయ్యారా.. లేక మార్చేందుకు ఇంకా సమయం ఉందని వెయిట్ చేస్తున్నారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇటు ఎంపీ అభ్యర్థి విషయంలో వైసిపి కొత్త ఆలోచనలతో ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది. బొత్స ఫ్యామిలీ నుంచి ఒకరు విజయనగరం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నారట. అయితే ఇప్పటివరకు ఈ ప్రతిపాదనపై వైసీపీ పెద్దల నుంచి సానుకూలంగా స్పందన రాలేదని తెలుస్తోంది. ఇక టిడిపి – జనసేన కూటమి జిల్లాలోని 50శాతం సీట్లపై క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటికైనా వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తి పెరుగుతోంది.