ICCD Feb15th: అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ డే సందర్భంగా ప్రత్యేక స్టోరీ..!

ప్రపంచంలో కల్మశం లేనివి కొన్ని ఉంటాయి. అందులో ఒకరు పిల్లలు. వీరి నవ్వులు, బాల్యం, చేష్టలు చాల స్వచ్ఛంగా ఉంటాయి. ఇలాంటి కల్మశం లేని పువ్వు లాంటి నవ్వుల్ని క్యాన్సర్ అనే కాలుష్య కణాలు చేరి వారి నవ్వులను, జీవితాలను నలిపేస్తోంది.

  • Written By:
  • Publish Date - February 15, 2023 / 02:21 PM IST

నేడు అంతర్జాతీయ చిన్నపిల్లల క్యాన్సర్ దినోత్సవం. ప్రస్తుతం మనం అత్యంత ఆధునాతనమైన సమాజంలో ఉన్నాం. అయినప్పటికీ ప్రపంచంలో ఈ క్యాన్సర్ అనే మహమ్మారి దెబ్బకు పిల్లలు బలి అవుతూనే వున్నారు. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఆ జీవితం క్యాన్సల్ అనేవారు. కానీ ప్రస్తుత యుగంలో కూడా సంవత్సరానికి 4లక్షల మంది పసిపిల్లలు, మధ్యవయస్కులు క్యాన్సర్ బారిన పడుతున్నట్లు క్యాన్సర్ అవగాహనా సంస్థల లెక్కలు చెబుతున్నాయి. అధిక సంపన్న దేశాల్లో 60శాతం పైగా చికిత్స తీసుకొని వ్యాధిని నయం చేసుకుంటున్నారు. అదే అల్ప, మధ్య ఆదాయం కల్గిన దేశాల్లో అయితే దీనివిలువ 20శాతం ఉంది.

క్యాన్సర్ రావడానికి కారణాలు:
ప్రతి ఒక్కమానవునిలో రక్తకణాల పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కణాలు వాటి పని అవి చేసుకుంటూ పోతే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అదే కణాలు సాధారణంగా కాకుండా అసాధారణంగా ఉంటే వాటికి క్యాన్సర్ కణాలు అంటారు. ఈ కణాలు శరీరంలో ఒక్కచోట ఉండకుండా మొత్తం దేహానికి విస్తరిస్తుంది. ఇది రక్తంలో కలిసి ఉంటుంది. గడ్డల రూపంలో ఉంటుంది. చిన్నపిల్లలకు సాధారణంగా క్యాన్సర్ రాదు. వస్తే కుటుంబం మొత్తం విస్తరిస్తుంది. 2 నుంచి 18 సంవత్సరాలలో పిల్లలకు వస్తుంది. లుకీమియా అనే బ్లడ్ క్యాన్సర్ 2 నుంచి 8 సంవత్సరాలు, 13 నుంచి 18 సంవత్సరాల వయస్సులో ని పిల్లలకు ఎక్కవగా వస్తుంది. విమ్స్ ట్యూమర్ అనే కిడ్నీ క్యాన్సర్ కూడా పిల్లలో అధికంగా వస్తుంది. 2నుంచి 8 సంవత్సరాల వయస్సు కలిగిన వారిలో వస్తుంది. లింఫోమా అనే క్యాన్సర్ కూడా 10 సంవత్సరాలు పైబడిన పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇవి రావడానికి ప్రదాన కారణం సరైన పోషకాహారం ఉండక పోవడం, జన్యుపరమైన లోపాలు, వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందని పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ లు చెబుతున్నారు.

పిల్లల్లో క్యాన్సర్ గుర్తించడం ఎలా:
పసి వయస్సులో పిల్లలు చెప్పలేరు. వారికి ఫలానా లక్షణాలున్నాయని. వీటి గురించి వారికి ఎలా చెప్పాలో అవగాహన ఉండదు. అలాంటప్పుడు మనం ఎలా గుర్తించాలనే అనుమానం అందరిలో కలుగుతుంది. పిల్లలు చేసే రోజూవారి దినచర్యలో మనం జాగ్రత్త తీసుకోవాలి. వారు అనుసరిస్తున్న తీరును శ్రద్దగా పరీక్షించాలి. తోటి పిల్లలతో ఆడుకోవడానికి మక్కువ చూపకపోయినా, చురుగ్గా స్పందించక పోయినా, తరచూ జ్వరం వస్తున్నా, నడకలో బ్యాలెన్స్ లేకపోయినా, సరైన ఆహారం తీసుకున్నప్పటికీ బరువు పెరగకుండా రోజు రోజుకు తగ్గిపోతున్నా, పేలగా కనిపించినా, శరీరంపై బ్లూ రంగులో మచ్చలు ఏర్పడితే, శరీరంలో ఎక్కడైనా గడ్డలుగా కనపడితే వెంటనే స్పందించి సరైన వైద్యున్ని సంప్రదించాలి. ఇవన్నీ సాధారణ లక్షణాలు. అదే బ్రైన్ క్యాన్సర్ వస్తే దాని లక్షణాలు కొద్దిగా వేరుగా ఉంటాయి. తరచూ తలనొప్పి, వాంతులు అవ్వడం. ఈ లక్షణాలను ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత త్వరగా వ్యాధిని నయం చేయవచ్చు.

ఎలా నయం చేయవచ్చు:
చిన్నపిల్లల్లో పెద్దవాళ్లలో వచ్చే క్యాన్సర్లు వేరు వేరు. పెద్దవాళ్లలో రొమ్ము క్యాన్సర్, కడుపులో పుండు క్యాన్సర్ లాంటివి పెద్దవారిలో కనిపిస్తాయి. పిల్లల్లో ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్లు తరచూ చూస్తాం. చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తే కీమో థెరపీ, రేడియోషన్ థెరపీ తట్టుకునే శక్తి వారికి ఎక్కువగా ఉంటుంది. ప్రాశ్చాత్య దేశాల్లో కీమోథెరిపీ ద్వారా చికిత్స చేసి 90 శాతం వరకూ వ్యాధిని నయం చేయవచ్చు. మన దేశానికి వస్తే ఇది 60శాతంగా ఉంది. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు ఆలస్యంగా డాక్టర్లని సంప్రదించడం. ఈలోపూ ఇన్ఫెక్షన్లు చేరి వ్యాధి మరింత ముదరడం. దీనిమూలకంగా పిల్లలు చనిపోవడం జరుగుతుంది. సరైన అవగాహన లేక ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు కీమోథెరిపీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి. వ్యాధి తీవ్రత తెలియక ఒకేరకమైన చికిత్సను అందిస్తూ ఉండేవారు. ప్రస్తుతం అలా లేదు. దీనికి ప్రత్యేకమైన డయాగ్నోస్టిక్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. దీనిద్వారా వ్యాధి తీవ్రతను ప్రతి నెలకో త్రైమాసికానికో పరీక్షించి చికిత్స అందించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి.

తల్లిడండ్రులకు అవగాహన తప్పనిసరి:
ఈ పిల్లల్లో వచ్చే క్యాన్సర్ కి దాదాపు 2 నుంచి రెండున్నర సంవత్సరం పాటూ చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. మొదటి ఆరునెలలు ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్ మెంట్ ను క్రమం తప్పకుండా వచ్చి చేయించుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఒక్కోసారి బ్లడ్ క్యాన్సర్ లు తిరగబడతాయి. అలాంటప్పుడు రెండు రకాలుగా చికిత్స అందించవచ్చు. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ అంటారు. ఇందులో అటలోగస్, ఆటోజనిక్ అని రెండు రకాలుంటాయి. వీటిపై శ్రద్ద చూపించరు. ఏవో రకరకాల పనుల కారణంగానో.. ప్రతిసారీ క్యాన్సర్ కేర్ సెంటర్లకు వెళ్లలేకో.. ఏది బెస్ట్ క్యాన్సర్ సెంటర్ అనే విషయాన్ని గుర్తించడంలో లోపం కారణంగానో.. వైద్యపరీక్షలు జరిపించుకునే శక్తి లేకనో ఇలా పిల్లలు వ్యాధిబారిన పడి జబ్బు ముదిరి చనిపోతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటూ ఉంటారు. నేటి బాలలు ఇలా క్రమక్రమంగా ఈ మహమ్మారి ధాటికి పిట్టల్లా రాలిపోతుంటే బాల భారతం కాస్త బలమైన వ్యాధి భారతంగా మారే ప్రమాదం ఉంది.

 

 

T.V.SRIKAR