Traffic Rules:హెడ్‌ఫోన్స్‌ వాడుతూ బండి నడిపితే.. ఏపీలో రూ. 20వేల ఫైన్‌ నిజమేనా ?

సోషల్‌ మీడియా వచ్చాక.. ఏది అబద్దమో, ఏది నిజమో అంత ఈజీగా తెలియటం లేదు. అబద్ధం కూడా నిజం అంత స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది రకరకాల ఫ్లాట్‌ఫామ్‌లో ! ఏపీ విషయంలో ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే జరిగింది.

  • Written By:
  • Updated On - July 26, 2023 / 06:56 PM IST

రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఏపీలో ఇయర్ ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే 20వేల రూపాయల ఫైన్ విధిస్తారనేది ఆ వైరల్‌ న్యూస్‌ సారాంశం. ఆగస్ట్ ఒకటి నుంచి ఈ నిబంధన నిబంధన అమల్లోకి వస్తుందంటూ 48గంటలుగా తెగ ప్రచారం సాగుతోంది. దీంతో ఏపీ సర్కార్‌, సీఎం జగన్‌ను టార్గెట్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో పేలిన మీమ్స్‌, ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. భరత్‌ అనే నేనులో మహేష్‌ బాబు అనుకుంటున్నావా జగన్ అని కొందరు.. ఇలా కూడా జనాలను బాదేస్తావా సీఎం అంటూ మరికొందరు.. ట్రోల్స్‌ మీద ట్రోల్స్ చేశారు.

దీనిపై రవాణా శాఖ కమిషనర్ రియాక్ట్ అయ్యారు. ఇదంతా అసత్య ప్రచారమని తేల్చి చెప్పారు. ఇదంతా ఉత్తి ముచ్చట అని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే.. రాష్ట్రంలో సవరించిన జరిమానాలు వసూలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే.. మొదటిసారి 15వందల నుంచి 2వేలు జరిమానా విధిస్తామని అన్నారు. ఇదే విధంగా పదేపదే పట్టుబడితే 10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తేల్చిచెప్పారు. ఈ అంశంలో జరిమానా పెంపు ఆలోచన లేదని స్పష్టం చేశారు. దీంతో సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారానికి బ్రేక్‌ పడింది.