irctc: కూతపెట్టే రైల్వే వ్యవస్థపై కాకరేగిన ప్రయాణీకులు..!

భారతీయరైల్వే అంటే దేశంలోనే అతి పెద్ద రవాణా కల్గిన నెట్వర్క్. సామాన్యుడి నుంచి సెలబ్రటీ వరకూ ప్రతిఒక్కరూ ఇందులో నిత్యం లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. మధ్య, దిగువ తరగతి వారైతే ప్రయాణ ఖర్చు తక్కువ అని భావిస్తారు. అదే పేరొందిన వారైతే సౌకర్య పరంగా దీనికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - March 4, 2023 / 07:35 PM IST

సాధారణంగా రైలు ప్రయాణం అంటే మూడు నెలల ముందుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. కొందరైతే అప్పటికప్పుడు ప్రయాణాల నిమిత్తం ఒక్కరోజు ముందు తత్కాల్ ద్వారా బుక్ చేసుకుంటారు. ఇలాంటి ఐఆర్సీటీసీ యాప్ లు అప్పుడప్పుడూ మొరాయిస్తూ ఉంటాయి. దీనిపై అధికారులు సర్వర్ సమస్యలు తలెత్తడం వల్ల ఇలా జరిగింది అని చెబుతూ ఉంటారు. తాజాగా జరిగిన పరిణామం కొంత ఆగ్రహానికి గురైయ్యేలా చేసింది. దీనికి కారణం అధికారుల స్పందన కరువు అవ్వడంతో టికెట్ బుక్ చేసుకోవాలని భావించిన ప్రతి ఒక్కరూ నిరుత్సాహానికి గురై సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు.

నేటి ఆధునిక యాప్ ల యుగంలో ప్రతి ఒక్కరి అరచేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా బుకింగ్ కౌంటర్ జేబులోనే ఉందనే భావనను ఐఆర్సీటీసీ తీసుకొచ్చింది. ఇది కేవలం భావనకే పరిమితం అయ్యేలా ఈ యాప్ డెవలప్ చేసి పర్యవేక్షించే ఐటీ అధికారుల పనితీరు ఉందని చెప్పాలి. ఇది ఒక్కసారి కాదు చాలా సార్లు ఇలా జరుగుతున్నప్పటికీ రైల్వే శాఖ ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవడంలేదు. తత్కాల్ రిజర్వేషన్ చేసుకుందాం అని భావించిన వారి నోట్లో మట్టి కొట్టే విధంగా దీని పనితీరు ఉండడం గమనార్హం. ప్రతిరోజూ ఉదయం 10 గంటల కు ఏసీ క్లాస్ రిజర్వేషన్ టికెట్లు తత్కాల్ కోటాలో విడుదల అవుతూ ఉంటాయి. అలాగే 11 గంటలకు సాధారణ స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ సంబంధించిన బుకింగ్ ప్రారంభం అవుతుంది. ఈ రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టేటప్పుడు ఒక్క నిమిషం ఆలస్యం అయినా వాటి రేట్లు ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ఎవరికి వీలైనంత వేగంగా వారు బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇలా లక్షల మంది దీనిని వినియోగిస్తారని అధికారులకు తెలుసు. అయినప్పటికీ అడుగడుగునా నిర్లక్ష్యాన్ని ప్రదర్శింస్తూ ఉంటారు. రోజులో ఒక రెండు గంటలు మాత్రమే ఇలా జరుగుతుంది. కాబట్టి దీనిపై యంత్రాంగం తగిన చర్యలు చేపట్టి ఈ సైట్ గ్రిడ్ కెపాసిటీని పెంచాలి. అప్పుడు యూజర్లకు అతి సులువుగా టికెట్ పొందేందుకు వీలవుతుంది. ఇదిలా ఉంటే ఈరోజు జరిగిన దానిపై ఐఆర్సీటీసీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశంగా చెప్పాలి.

ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి చేదు అనుభవం ఎదురైంది. టికెట్ బుకింగ్ సమయంలో పలురకాలా ఎర్రర్స్ చూపిస్తూ వచ్చింది. మరి కొందరికైతే డబ్బులు పే చేసినప్పుటికీ టికెట్ బుక్ అయినట్లు చూపించలేదు. పోయిన డబ్బులు తిరిగి రాలేదు. అలాగే దీని ఆన్ లైన్ పేమెంట్స్ అన్నీ రేజర్ అనే ఆన్ లైన్ పేమెంట్ సంస్థ చూసుకుంటుంది. ఇది భారతదేశపు అత్యంత సెక్యూరిటీ పేమెంట్స్ సంస్థగా పేరుగాంచింది. అయితే డబ్బులు కట్ అయిన తరువాత ఈ సంస్థ నుంచి కూడా ఎలాంటి సమాచారం ఉండదు. అటు రైల్వే అధికారులు స్పందించక, ఇటు ప్రయాణాలు చేయాలని సిద్దం అయినవారికి ఎలాంటి సమాచారం ఇవ్వక, పోయిన డబ్బులు తిరిగి ఇప్పించే ప్రయత్నం చేయక నిమ్మకు నీరెత్తినట్లు రైల్వే శాఖ వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిఒక్కరూ తమదైన శైలిలో సామాజికమాధ్యమం వేదికగా స్పందించారు.

రోజు రోజుకు ప్రైవేటైజేషన్ పేరుతో భారత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్ముకుంటూ పోతే రేపు భారతం బికారిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం వల్ల ప్రయాణీకులకు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదం రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. తాజాగా జరిగిన టికెట్ బుకింగ్ వ్యవహారం పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇండియన్ రైల్వే అంత పనికిరాని వ్యవస్థ మరొకటి లేదని, ఇదేనా డిజిటల్ ఇండియా అంటే అని వ్యంగంగా విమర్శించారు.

ఇప్పటికైనా రైల్వేశాఖ స్పందించి సరైన సేవలు అందించాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవస్థలే బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజల పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు. దీనిపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. తత్కాల్ సమయంలోనే ఇలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా పఠిష్టమైన సర్వర్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇలాగే వదిలేస్తే ప్రభుత్వమే ప్రజలను ప్రైవేటైజేషన్ పేరుతో దోచుకునే పరిస్థితులు వస్తాయని ఘాటుగా స్పందిస్తున్నారు.

 

 

 

T.V.SRIKAR