NEW JOBS YEAR: కొత్త కొలువులోచ్చాయి – మంచి ప్యాకేజి ఇస్తాయి..!

  • Written By:
  • Publish Date - February 6, 2023 / 12:27 PM IST

మన ప్రపంచం చాలా చిన్నదని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే వేరే ప్రపంచం తెలియదు కనుక. పనిలో పడ్డవారికి వారు చేసే జాబ్ లోనే ప్రపంచం చూస్తూ కాలం వెళ్లబుచ్చుతూ ఉంటారు. అందుకే మన ముందుఉన్న ప్రపంచాలన్ని చూడలేరు. అయితే కాలం అలా కాదు కదా మన చుట్టూ ఉంటూనే ఉంటూ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. అలా చుట్టేసి ఊరికే ఉండదు. కొన్ని కొత్త రకాలా విషయాలను, సాంకేతికతను, ఉద్యోగాలను, మెళుకువలను మనకి పరిచయం చేస్తుంది. వాటిని అందిపుచ్చుకొని జీవితచక్రాన్ని నెట్టుకు రాగలిగితే ఇకేముంది మన ముందున్నదంతా కొత్త రంగుల లోకమే. అలా రంగుల లోకంలోకి మనల్ని తీసుకెళ్లేందుకు కొన్ని సరికొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలను కాలం మోసుకొచ్చేసింది. వాటికి విలువకూడా ఐదు ఆరు అంకెల్లో ఉంటుంది.  అదేంటి ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను కంపెనీలు పీకేస్తుంటే మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటున్నారు అనే అనుమానం కలుగవచ్చు. కానీ ప్రపంచం డిజిటలైజేషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తుండడంతో అంతే వేగంగా ఉపాధి అవకాశాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

 

అలా ఏడాదికి సగటున రూ.7లక్షల నుంచి 30లక్షల వరకూ వేతనాలు ఇచ్చే ఉద్యోగాల్లో కొన్నింటిని పరిచయం చేసుకుందాం. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ రంగంలో సగటున రూపాయలు 40లక్షలు ఆదాయం వస్తుంది. ప్రోడక్ట్ మేనేజర్ కెరీయర్ ఎంచుకున్న వారికి రూ. 14.40 లక్షలు ఉంటుంది. మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ కెరీయర్ లో 11.49 లక్షల వరకూ సంపాదించుకోవచ్చు. ఐటి రంగంలో కూడా మెషిన్ లర్నింగ్, బ్లాక్ చైన్ లకు రూ. 7లక్షల నుంచి 8 లక్షల వేతనం వస్తుంది. వైద్యో నారాయ‎ణో  హరి అనే మాట వినే ఉంటారు. అదే డాక్టర్ల విషయానికొస్తే రూ.6.99 లక్షల నుంచి 11.59 లక్షల వరకూ ఆదాయాన్ని గణించే అవకాశం ఉంది. సీఎలకు రూ.7.89లక్షల వేతనం లభిస్తుంది. 2023లో టాప్ 10 ఉద్యోగాల జాబితా విడుదల చేసిన సింప్లీ లెర్న్

 

  • మెషిన్ లెర్నింగ్:

వ్యాపార సంస్థలు తమ వ్యాపార విస్తరణలో భాగంగా మిషెన్ లెర్నింగ్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఆధారపడి పనిచేస్తుంది. ఈ ప్రోగ్రాంల ద్వారా వ్యాపార సంస్థలకు వారి అభిరుచికి తగిన విధంగా అల్గారిధంను ఏర్పాటు చేస్తారు. నిపుణులు ఈ అల్గారిధంను అభివృద్ది చేస్తారు. ఈ ఎంఎల్ కోర్సు పూర్తిచేసిన వారికి సగటున రూ. 8 లక్షల వరకూ లభిస్తుంది. అదే అనుభవజ్ఙులైతే రూ.20లక్షల వరకూ సంపాదించవచ్చు. యాక్సెంచర్, ఐబిఎం, ఇన్ఫోటెక్, జైకస్, క్వాంటిపి వంటి సంస్థలు ఈ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.

 

  • బ్లాక్ చైన్ డెవలపర్:

ఈ మధ్యకాలంలో టెక్నాలజీ మంచినీళ్లు తాగినంత వేగంగా అభివృద్ది చెందుతొంది. ప్రస్తుతం ఉన్న కొత్త టెక్నాలజీ కోర్సుల్లో అధికంగా దీనిపేరు వినపడుతుంది. దీని ఉపయోగం చాలా పెద్దస్థాయిలో ఉంటుంది. దేశాల నగదు లావాదేవీలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, డేటా సెక్యూరిటీ వంటి వాటిలో ఈ బ్లాక్ చైన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ కోర్సులు పూర్తిచేసిన వారి సగటు వేతనం రూ.8 లక్షల రూపాయలు లభిస్తుంటే.. అనుభవం ఉన్నవారికి ఏకంగా రూ. 40లక్షల వరకూ ఇస్తున్నారు. ఆక్సీసెస్, సైంజీ, ప్రిమ్ చైన్, సాప్ట్ కోల్, ఓపెన్ ఎక్సల్, మైండెప్ట్ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి.

 

  • డేటా సైంటిస్ట్:

డేటా సైంటిస్ట్ లకు అంతర్జాతీయంగా ఇప్పుడు అత్యధిక డిమాండ్ ఉంది. తమకు అందుబాటులో ఉన్న డేటాను సేకరించి సరైన విశ్లేషణ చేసే వారికి లక్షల్లో జీతాలు ఇవ్వడానికి సంస్థలు ముందుకు వస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ లో పట్టున్న వారికి డేటా సైంటిస్ట్ సరైన వేదిక. ఈ రంగాన్ని ఎంచుకున్న వారికి దేశంలో సగటున రూ.11లక్షల నుంచి అనుభవం ఉన్న వారికి గరిష్టంగా రూ.70 లక్షల వరకూ ఇచ్చేందుకు కంపెనీలు వెనుకడుగు వేయడంలేదు. డేటా సైన్స్ సర్టిఫికేషన్ పూర్తి చేసిన వారికి అమెజాన్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, వాల్ మార్ట్ ల్యాబ్స్, గ్రే ఆటమ్ వంటి సంస్థలు వీరికి ఎల్లప్పుడూ ఆహ్వానం అందిస్తున్నాయి.

 

  • వైద్యవిద్య:

ఈ వైద్యరంగంలోకి వచ్చేసరికి అధికవేతనంతో పాటూ అధిక డిమాండ్ కూడా ఉంటుంది. మన దేశంలో వైద్యసేవలు విరివిగా విస్తరించడంతో సరైన వైద్యసేవలు అందించే నిపుణులకు అధిక వేతనం చెల్లించి మరీ నియామకం చేపడుతున్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. ప్రస్తుత కాలంలో ఏదైనా వ్యాధిబారిన పడ్డవారు మెరుగైన చికిత్సను తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. హెల్త్ కేర్ అడ్మిట్, నర్సింగ్, హోమ్ హెల్త్ వంటి రంగాలకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం సగటు వైద్యుని  వేతనం రూ.10లక్షలు గా ఉంది. జనరల్ ఫిజీషియన్ కు అయితే రూ. 7 లక్షల వరకూ ఉంది. జనరల్ సర్జన్ అయితే రూ. 12లక్షల వరకూ సంపాదిస్తున్నారు. ఇక స్పెషలైజేషన్ చేసిన వారైతే ఏకంగా రూ.20లక్షల వరకూ వేతనం లభిస్తుంది. ఎయిమ్స్, ఫోర్టిస్, అపోలో, మాక్స్, కొలంబియా, ఆసియా వంటి ఆస్పత్రులు అధిక వేతనాన్ని ఇస్తున్నాయి.

 

  • మేనేజ్ మెంట్ కన్సల్టెంట్:

ఎంబిఏ చేసి మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ వృత్తిని ఎంచుకున్న వారికి సగటున రూ.11 లక్షలు పైగా వేతనం అందిస్తున్నాయి కంపెనీలు. వీరికి ప్రారంభవేతనం రూ.6 నుంచి 8 లక్షల వరకూ ఇస్తున్నారు. అదే అనుభవం ఉన్న వారికి మంచి మేనేజ్ మెంట్ స్కిల్స్ ఉన్నవారికైతే గరిష్టంగా రూ.26 లక్షల వరకూ ఆదాయం లభిస్తుంది. కేపీఎంజీ, పీడబ్ల్యూసీ, మెకన్సీ, డెలాయిట్, ఎర్నెస్ట్ యంగ్, యాక్సెంచర్ వంటి సంస్థలు మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ అవకాశాలు కల్పిస్తున్నాయి. సీఎ, మార్కెటింగ్ మేనేజర్స్, బిజినెస్ అనలిస్ట్ వంటి రంగాల్లో కూడా రూ.4 లక్షల నుంచి గరిష్టంగా రూ. 40లక్షల వరకూ వేతనాలు లభిస్తున్నాయి. ఈ మూడు వృత్తులను ఎంచుకున్న వారికి ఈ ఏడాది పలు అంతర్జాతీయ సంస్థలు ఉన్నతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. మార్కెటింగ్ మేనేజర్స్ కి అయితే  అమెజాన్, ఫ్లిప్ కార్ట్, టీసీఎస్, టాటామోటార్స్ వంటి సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. అదే బిజినెస్ అనలిస్ట్ లకు మైక్రోసాప్ట్, సిటి, యాక్సెంచర్ వంటి సంస్థలు ఉపాధిని అందిస్తున్నాయి.

 

  • ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్స్:

దేశవిదేశాల్లో అత్యధికంగా వేతనాలు అందిస్తున్న వాటిలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ ఒకటి. ఖాతాదారులకు సంబంధించిన డబ్బును నిర్వహిస్తూ వారికి అధిక లాభాలను అందించే ఉద్యోగం. ఫైనాన్స్ సబ్జెక్ట్ తో పాటూ వివిధ ఫైనాన్షియల్ సేవలపై పట్టున్న వారికి ఇది సరైన అవకాశం. ఈ రంగంలో ప్రారంభవేతనాలు రూ.10లక్షల నుంచి రూ.12లక్షల వరకూ ఉంటుంది. అనుభవం ఉన్న వారికైతే వారి వారి పని సామర్థ్యంను బట్టి వేతనాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఉద్యోగాలకు సిటిబ్యాంక్, డచ్ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి, గోల్డ్ మాన్ శాక్స్, జేపీ మోర్గాన్ ఛేస్ వంటి సంస్థలు అవకాశాలను కల్పిస్తున్నాయి.