Singer Sai Chand: కేసీఆర్‌తో కన్నీళ్లు పెట్టించిన సాయిచంద్‌ పాట..

తెలంగాణ ఉద్యమంలో పాట పోషించిన పాత్ర అమోఘం, అనిర్వచనీయం, అనన్యసామాన్యం. అలాంటి కొన్ని వేల పాటలు పాడిన తెలంగాణ గాయకుడు సాయిచంద్‌ ఇవాళ తెలంగాణ సమాజం మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం.

  • Written By:
  • Updated On - June 29, 2023 / 12:08 PM IST

Singer Sai Chand: ఒక మనిషిని మాట కదిలించలేనంత బలంగా పాట కదిలిస్తుంది. చైతన్యాన్ని తట్టిలేపుతుంది. తెలంగాణ ఉద్యమంలో పాట పోషించిన పాత్ర అమోఘం, అనిర్వచనీయం, అనన్యసామాన్యం. అలాంటి కొన్ని వేల పాటలు పాడిన తెలంగాణ గాయకుడు సాయిచంద్‌ ఇవాళ తెలంగాణ సమాజం మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం.

తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో కొత్త ఉత్తేజం నింపిన సాయిచంద్‌.. తన జీవితంలో వేల పాటలు పాడారు. ప్రతీ కార్యక్రమంలో తన పాటలతో తెలంగాణ హక్కులను సమాజానికి ఎలుగెత్తి చాటారు. ప్రత్యేక తెలంగాణ వస్తే తెలంగాణకు జరిగే న్యాయం ఏంటో, ఆంధ్రా నాయకులు తెలంగాణకు చేస్తున్న అన్యాయం ఏంటో తన పాటల ద్వారా చెప్పారు. ఉద్యమ సమయంలో అమరవీరుల గురించి సాయిచంద్‌ పాడిన పాట కేసీఆర్‌తో పాటు సభలో ఉన్న ప్రతీ ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ కోసం అశువులుబాసిన అమరవీరులను తలచకుంటూ “రాతి గుండెల్లోన కొలువైన శివుడా.. రక్త బంధం విలువ నీకు తెలియదురా” అంటూ సాయిచంద్‌ పాట పాడారు. ఆ పాట ప్రతీ ఒక్కరి గుండెను హత్తుకుంది.

వేల హృదయాలను కదిలించింది. కేసీఆర్‌తో పాటు వేదికపై ఉన్న ప్రతీ ఒక్కరు ఈ పాట విని కన్నీళ్లు పెట్టుకున్నారు. అమరవీరుల కుటుంబాలు తమ పిల్లలను తలుచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఉద్యమంలోనే కాదు.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిత తరువాత కూడా సాయిచంద్‌ ఎన్నో పాటలు ప్రభుత్వం గురించి పాడారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. దీంతో సీఎం కేసీఆర్‌ ఆయనకు గిడ్డంగుల శాఖ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చారు. రాజకీయంగా జీవితంలో ఎదుగుతున్న సమయంలో సాయిచంద్‌ హార్ట్‌ఎటాక్‌తో చనిపోవడం ఆయన కుటుంబ సభ్యుల్లో అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.