World Cup Inspiring stories: రెండు టికెట్ల కథ.. దెబ్బకి ఇంగ్లండ్‌ తిక్క కుదిర్చింది.. అహంకారాన్ని తొక్కి పెట్టింది..!

మీ బలుపు, అహంకారం, ఆవేశం మడిచి మనసులో పెట్టుకోండి.. మా దగ్గర చూపించొద్దు.. ఇంగ్లండ్‌ క్రికెట్‌కు భారత్‌ ఎలా బుద్ధి చెప్పిందో తెలుసా..?

  • Written By:
  • Publish Date - June 25, 2023 / 01:34 PM IST

ప్రపంచంలో ప్రతి మూల అడుగుపెట్టి భూగోళాన్ని నిలువుదోపిడి చేసిన ఇంగ్లండ్‌.. క్రికెట్‌లోనూ పెత్తనం చెల్లాయిస్తున్న రోజులవి. క్రికెట్‌ని కనిపెట్టింది తామేనని.. మిగిలిన జట్లు మేము చెప్పిందే వినాలని విర్రవీగుతున్న కాలమది. 1975లో తొలి సారి ప్రపంచ కప్‌ జరిగింది..1979లో రెండో వరల్డ్‌ కప్‌.. 1983లో మూడో వరల్డ్‌ కప్‌ జరిగాయి. ఈ మూడు సార్లు ఇంగ్లండే టోర్నీని హోస్ట్ చేసింది. మిగిలిన దేశాలకు టోర్నీ నిర్వాహణ చేత కాదు అని.. తాము మాత్రమే వరల్డ్‌ కప్‌ నిర్వహించే స్థితిలో ఉన్నామని గొప్పలు పోయింది. అప్పటికీ ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ ఆట పరంగా క్రికెట్‌ని డామినేట్ చేస్తున్నాయి..అయితే ఇంగ్లండ్‌ చెప్పిందే ఆ దేశాలు కూడా పాటించేవి. ఎందుకులే వీళ్లతో గోల అనుకునేవి. అయితే కాలం ఎప్పుడు ఓకేలాగా ఉండదు.. ప్రతిదేశాన్ని పీల్చిపిప్పి చేసి తర్వాత చావు దెబ్బ తిని సొంత దేశానికి చెక్కేసిన తెల్ల పాలకులకు క్రికెట్‌ డామినేషన్‌లోనూ ఇండియా చెక్‌ పెట్టింది. భారత్‌ పట్టుదల ముందు ఇంగ్లండ్‌ మూతి మూడుచుకోని సైలంట్‌గా సైడ్‌ ఐపోయింది. దానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా..? ఈ కథ వింటే కచ్చితంగా అతనికి సెల్యూట్ సెల్యూట్ చేస్తారు.

రెండు టికెట్లు కావాలి:
వెస్టిండీస్‌ని ఫైనల్‌లో చిత్తూ చేసి 1983 ప్రపంచ కప్‌ని టీమిండియా ముద్దాడి ఇవాళ్టికి సరిగ్గా 40ఏళ్లు. భారత్‌ కప్‌ గెలిచిన సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎన్‌కేపీ సాల్వే ఉన్నారు. 1982 నుంచి 1985 వరకు బోర్డు అధ్యక్షుడిగా కొనసాగారు. 1983 వరల్డ్‌ కప్‌లో టీమిండియా పైనల్‌కి వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. ఇటు సాల్వే ఫైనల్‌ మ్యాచ్‌ లార్డ్స్‌లో చూసేందుకు రెండు టికెట్లు అడిగారు. ఇంగ్లండ్‌ బోర్డు ఆ రెండు టికెట్లు కూడా ఇవ్వలేదు.. చాలా చీప్‌గా మాట్లాడింది..మీరు ఇక్కడ వరకు రావడమే ఎక్కువ అంటూ ఎగతాళీ చేసింది. సీన్‌ కట్ చేస్తే టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. సాల్వేకి ఇంగ్లండ్‌ అవమానించిన తీరు మాత్రం మనసులోనే ఉండిపోయింది.

ఆసియా బోర్డులను యూనైట్ చేసిన సాల్వే:
ప్రతిసారీ వరల్డ్‌ కప్‌ ఇంగ్లండ్‌లోనే జరగడమేంటి..? మిగిలిన దేశాలు హోస్ట్ చేయలేవా..? ఇదే ప్రశ్న సాల్వే బుర్రలో అనేక సార్లు గిర్రున తిరిగింది. వెంటనే పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరిపాడు. 1987 ప్రపంచ కప్‌ కలిసి హోస్ట్ చేద్దామని అడిగాడు. పాకిస్థాన్‌ కూడా ఒప్పుకుంది.. వెంటనే ఇంగ్లండ్‌ తన మాటలకు పని చెప్పింది. మరోసారి ఇండియాని తక్కువ చేసి మాట్లాడింది. పనిలో పనిగా పాకిస్థాన్‌పై కూడా కామెడీ చేసింది. అయితే సాల్వే ఇవేవీ పట్టించుకోలేదు. ప్రపంచ దేశాల మద్దతు కూడా కూడగట్టారు. సాల్వే ఫైట్‌తో 1987లో ఇండియా,పాక్‌ సంయుక్తంగా వన్డే వరల్డ్‌ కప్‌ని నిర్వహించింది. ఇంగ్లండ్‌ తెల్లముఖం వేసుకోని తలదించుకుంది. ఆ తర్వాత 1996లో, 2011లో టీమిండియా మరోసారి వరల్డ్‌ కప్‌ నిర్వహించింది. ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. అది కూడా రిచ్‌గా..! ఇండియా ఇచ్చిన షాక్‌తో ఇంగ్లండ్‌ ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది.. అందుకే చెప్పేది అహంకారం పనికి రాదని.. !