Avesh Khan: తప్పును ఒప్పుకున్న ఓవరాక్షన్ బౌలర్ శాంతించిన విరాట్ ఫ్యాన్స్

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తాను చాలా తప్పుగా ప్రవర్తించానని లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆవేశ్ ఖాన్ అన్నాడు. అలా అతిగా ప్రవర్తించకుండా ఉండాల్సిందని, అలా చేసినందుకు సిగ్గుపడుతున్నానని తెలిపాడు.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 05:13 PM IST

ఇరు జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ హెల్మెట్‌ను నేలకు కొట్టి సంబరాలు చేసుకున్నాడు. అతని ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో పాటు ఇరు జట్ల మధ్య గొడవకు దారి తీసింది. సెకండ్ లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ-గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆవేశ్ ఖాన్‌పై అభిమానులు మండిపడ్డారు. ఈ ఘటనపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేశ్ ఖాన్ స్పందించాడు.

‘ఆ మ్యాచ్‌లో నాది ఓవరాక్షనే. అలా చేసి ఉండాల్సింది కాదు. ఆ తర్వాత నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. ఆ పరిస్థితుల్లో అలా జరిగిపోయిందంతే. ప్రస్తుతం నేను ఆ ఘటన పట్ల ఎంతగానో చింతిస్తున్నాను.’అని తెలిపాడు. అసలేం జరిగిందంటే.. ఐపీఎల్ 2023 సీజన్ లీగ్‌ దశలో లక్నో, ఆర్‌సీబీ జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 213 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో వికెట్‌ తేడాతో ఛేదించి విజయాన్నందుకుంది. అయితే.. చివరి బంతికి ఒక పరుగు అవసరమైన వేళ.. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఆవేశ్‌ ఖాన్ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి మిస్సయ్యాడు.

దాంతో నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు పరుగెత్తాడు. అదే సమయంలో కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ రనౌట్‌ చేయడం విఫలమవ్వడంతో లక్నో విజయం లాంఛనమైంది. దాంతో సంతోషాన్ని తట్టుకోలేకపోయిన ఆవేశ్ ఖాన్.. తన హెల్మెట్‌ను తీసి నేలకేసి కొట్టి సంబరాలు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ విజయంతో ఆర్‌సీబీ అభిమానులను నిశ్శబ్దంగా ఉండాలంటూ లక్నో మెంటార్‌ గంభీర్‌ సంజ్ఞ చేయడంతో వివాదాస్పదమైంది. అనంతరం లక్నో వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలవడంతో ఆ జట్టు ఆటగాళ్లు తమదైన శైలిలో లక్నోకు బదులిచ్చారు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశ్ ఖాన్ అతి వల్లే ఇరు జట్ల మధ్య గొడవ చేసుకుందని అప్పట్లో ఫ్యాన్స్ ఇప్పుడు అవేశ్ చెప్పిన సారీతో కొంత చల్లబడ్డారు.