Bumrah: గెలిచాం కానీ కిక్కు దొబ్బింది

ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది.

  • Written By:
  • Updated On - August 19, 2023 / 01:46 PM IST

ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. అయితే, వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుమ్రా నాయకత్వంలోని టీమ్ఇండియా తొలుత బౌలింగ్‌లో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌తో ప్రసిద్ధ్‌, రింకూ సింగ్‌ టీ20 అరంగేట్రం చేశారు. ఐర్లాండ్‌పై వరుసగా ఆరో మ్యాచ్‌ను భారత్‌ గెలవడం విశేషం. ఇంతకుముందు జరిగిన ఐదింట్లోనూ టీమ్‌ఇండియాదే విజయం. దాదాపు సంవత్సరం తర్వాత జట్టులోకి వచ్చిన భారత కెప్టెన్ బుమ్రా 2 వికెట్లతో మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకున్నట్లే ఉంది. రనప్‌ ఎక్కువగా తీసుకోకపోయినప్పటికీ బౌలింగ్‌లో లయను అందిపుచ్చుకోవడం మాత్రం భారత్ శిబిరంలో ఆనందం నింపింది.

మ్యాచ్‌ అనంతరం బుమ్రా కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము గెలిచినా కొన్ని అంశాల్లో మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో స్వింగ్‌కు అనుకూలంగా మారింది. అయితే వర్షం కారణంగా పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. అయినా, చివరికి విజయం సాధించడం సంతోషంగా ఉంది. ఐర్లాండ్‌ కూడా చాలా క్లిష్టపరిస్థితుల్లో నుంచి కోలుకుని మ్యాచ్‌లను ఆడుతోంది. వారు అద్భుతంగా ఆడారు. మా జట్టులో ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం వారికి అక్కరకొచ్చింది. ఇదే విధంగా మిగతా మ్యాచుల్లోనూ ఆడి ఫలితం సాధిస్తాం’’ అని బుమ్రా తెలిపాడు. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. దాదాపు సంవత్సరం తర్వాత అడుగు పెట్టి తొలి మ్యాచ్‌లోనే అవార్డును సొంతం చేసుకోవడం విశేషం.