చెన్నై కోసం ధోనీ త్యాగం.. వేలంలో నష్టపోయేది ఎంతో తెలుసా ?

చెన్నై సూపర్ కింగ్స్ తో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీది ఎలాంటి అనుబంధమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచీ ధోనీ ప్రయాణం ఆ జట్టుతోనే సాగుతోంది. చెన్నై ఫ్రాంచైజీ ఓనర్ శ్రీనివాసన్ తో ఉన్న రిలేషన్ కారణంగానే అతను మరో ఫ్రాంచైజీకి వెళ్ళలేదు. ఇకపై కూడా వేరే టీమ్ లోకి వెళ్ళే పరిస్థితి లేదు.

  • Written By:
  • Publish Date - August 20, 2024 / 07:27 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ తో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీది ఎలాంటి అనుబంధమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచీ ధోనీ ప్రయాణం ఆ జట్టుతోనే సాగుతోంది. చెన్నై ఫ్రాంచైజీ ఓనర్ శ్రీనివాసన్ తో ఉన్న రిలేషన్ కారణంగానే అతను మరో ఫ్రాంచైజీకి వెళ్ళలేదు. ఇకపై కూడా వేరే టీమ్ లోకి వెళ్ళే పరిస్థితి లేదు. చెన్నై ఫ్రాంచైజీతో తన రిలేషన్ వేరే లెవెల్ అంటూ గతంలోనే మహి చాలాసార్లు చెప్పాడు. అందుకే ఈ సారి కూడా వేలానికి ముందే పాత నిబంధనతో అతన్ని రిటైన్ చేసుకుంటే ధోనీ భారీగానే నష్టపోనున్నాడు. అసలు సంగతి ఏంటంటే ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించాలని సీఎస్కే ప్రతిపాదించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అయిదేళ్లు పూర్తయిన ప్లేయర్స్ ఇదే కేటగిరీలోకి వస్తారు.

దీంతో ఈ రూల్ తోనే ధోనీని రిటైన్ చేసుకునేందుకు చెన్నై పక్కా స్కెచ్ వేసింది. ఐపీఎల్ ఆరంభం నుంచి 2021 వరకు ఈ నిబంధనను అమలు చేశారని, దాన్ని తిరిగి ఈ మెగా వేలంలో కొనసాగించాలని కోరుతోంది. ఐపీఎల్ మెగా వేలం రూల్స్ ప్రకారం అనామక ప్లేయర్ రిటెన్షన్ ధర 4 కోట్లుగానే ఉంది. గత మూడు సీజన్లకు ధోనీ రూ.12 కోట్లు తీసుకున్నాడు. దీంతో సీఎస్కే డిమాండ్ చేసే రూల్‌ను ఐపీఎల్ నిర్వాహకులు అంగీకరిస్తే ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌‌గా పరిగణించాల్సి ఉంటుంది. అప్పుడు ధోనీ దాదాపు 8 కోట్ల మేర నష్టపోతాడు. అయితే తనకు ఎంతో దగ్గరైన ఫ్రాంచైజీ కోసం మహి త్యాగం చేసేందుకు పెద్ద ఆలోచించడం లేదని సమాచారం. ఒకవేళ ధోని రిటైర్మెంట్ ప్రకటించినా కూడా సీఎస్కేకు మెంటార్ గానే కొనసాగుతాడని ఇప్పటికే చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం తెలిపింది.