Ashes Trophy: మాటతో కాదు ఆటతో గెలువు.. నిన్ను చూసే ఇది నేర్చుకున్నా రెండో టెస్టుకు ముందు మాటల యుద్ధం

యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే, చివరి రోజు ఆసీస్ బ్యాటర్‌ ఉస్మాన్ ఖవాజాను ఉద్దేశించి ఇంగ్లాండ్‌ పేసర్ స్లెడ్జింగ్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 05:52 PM IST

మరో పేసర్ జేమ్స్ అండర్సన్ సహచరుడిని తీసుకుని పక్కకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో మ్యాచ్‌ ముగిసిన తర్వాత రాబిన్‌సన్ మాట్లాడుతూ.. గతంలో తమ జట్టుపైనా రికీ పాంటింగ్‌ సహా ఇతర ఆసీస్‌ ఆటగాళ్లు ఇలానే స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నాడు. ఆ వ్యాఖ్యలపై తాజాగా రికీ పాంటింగ్‌ స్పందించాడు. రాబిన్‌సన్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని, అనవసరంగా తన పేరును మధ్య లాగకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.

‘‘రాబిన్‌సన్‌ మాట్లాడిన తీరు సరికాదు. అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆసీస్‌తో ఇలాంటి ఇంగ్లాండ్‌ జట్టు ఆడలేదు. నాణ్యమైన ఆసీస్‌ జట్టుతో యాషెస్ క్రికెట్‌ అంటే ఏంటో వేగంగా అర్థం చేసుకోవాలి. గతవారమే ఓలీ రాబిన్‌సన్ నేర్చుకోలేకపోయాడు. అతడు కాస్త నెమ్మదిగా నేర్చుకుంటాడనుకుంటా. యాషెస్‌లో ఆసీస్ క్రికెటర్లతో మాట్లాడాలనుకుంటే.. ముందు నీ బౌలింగ్‌ ప్రదర్శన మెరుగ్గా ఉండేలా చూసుకో.

మ్యాచ్‌ అనంతరం ఏదో చెప్పానులనుకుని నా పేరును ప్రస్తావించాడు. అలా చేయకుండా ఉండాల్సింది. అయితే, అలాంటి వ్యాఖ్యలతో నాకు పోయిదేం లేదు. ఒకవేళ నా గురించి అతడు ఆలోచించాలనుకుంటే గత 15 ఏళ్ల కిందట వరకు నేనేం చేశానో తెలుసుకుంటే సరిపోతుంది. ఆసీస్‌ క్రికెటర్లతో మాట్లాడాలనుకుంటే మాత్రం కాస్త త్వరగా బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవాలి. నీ నైపుణ్యాలకు పదును పెడితే బాగుంటుంది’’ అని రికీ పాంటింగ్‌ వ్యాఖ్యానించాడు. ఓలీ రాబిన్‌సన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 98 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు అయితే, ఇంగ్లాండ్‌ మాత్రం మ్యాచ్‌ గెలవలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ఖవాజాను రాబిన్‌సన్ బౌల్డ్‌ చేశాడు.