World Cup 2023: బీసీసీఐ చేసిన ఆ పనితో మొదలైన రచ్చ.. ఇండియా-పాక్‌ మ్యాచ్‌ బాయ్‌కాట్‌ చేయాలని డిమాండ్‌..!

ఈ సారి వరల్డ్‌కప్‌ని నిర్వహిస్తుంది బీసీసీఐ సెక్రటరీ జైషా. ఆయన కేంద్రహోం మంత్రి అమిత్‌ షా కుమారుడు. వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ నుంచి ప్రతి విషయంలో జైషా నిర్వహణ తీరుపై కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీలు అనేక విమర్శలు గుప్పిస్తుండగా.. వారికి తాజాగా మరో అస్త్రం దొరికింది.

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 05:21 PM IST

World Cup 2023: రేపు ఇండియా, పాకిస్థాన్‌ మధ్య జరగనున్న వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా మరోవైపు సోషల్‌ మీడియాలో మాత్రం ఈ గేమ్‌ని బాయ్‌కాట్‌ చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. క్రికెట్‌కి, పాలిటిక్స్‌కి ముడి పెట్టవచ్చా..? టీమిండియా పాక్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడకూడదా..? ఈ టాపిక్‌పై నేషనల్‌ మీడియాలో అనేక సార్లు డిబేట్లు జరిగాయి. బీజేపీ భావజాలాన్ని మోసే మీడియా సంస్థలు పాక్‌తో క్రికెట్‌ ఆడకూడదని వాదిస్తే.. కొంతమంది క్రికెట్ ప్రేమికులు మాత్రం రాజకీయాలకు, ఆటకు లింక్‌ పెట్టవద్దని వాదిస్తారు.

అయితే ఈ సారి వరల్డ్‌కప్‌ని నిర్వహిస్తుంది బీసీసీఐ సెక్రటరీ జైషా. ఆయన కేంద్రహోం మంత్రి అమిత్‌ షా కుమారుడు. వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ నుంచి ప్రతి విషయంలో జైషా నిర్వహణ తీరుపై కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీలు అనేక విమర్శలు గుప్పిస్తుండగా.. వారికి తాజాగా మరో అస్త్రం దొరికింది. ఇటివలి కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీ కల్నల్, మేజర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రాణాలు కోల్పోయారు. దీన్ని కారణంగా చూపిస్తూ ఇండియా-పాక్‌ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్న డిమాండ్‌ సోషల్‌ మీడియాలో పెరుగుతోంది. దీనికి కాంగ్రెస్‌ మద్దతుదారులే ఎక్కువగా ప్రోత్సహిస్తుండటం విశేషం. నిజానికి 2019 వరల్డ్‌కప్‌ సమయంలో సీన్‌ రివర్స్‌ ఉంది. ఫిబ్రవరి 14, 2019 పుల్వామా ఘటనలో 40 మంది ఆర్మీ జవాన్లను పాక్‌ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. అదే ఏడాది వరల్డ్‌కప్‌ జరగగా.. అందులో ఇండియా వర్సెస్‌ పాక్‌ మ్యాచ్‌ షెడ్యూల్ చేసి ఉంది.

ఈ మ్యాచ్‌ని ఇండియా నిషేధించాలని బీజేపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సచిన్, గవాస్కర్‌ లాంటి క్రికెటర్లు ఈ ప్రచారాన్ని బహిరంగంగానే తప్పు పట్టారు. పాక్‌తో మ్యాచ్‌ ఆడకపోతే ఇండియా రెండు పాయింట్లు కోల్పోవాల్సి వస్తుందని సచిన్‌ చెప్పడం పెద్ద దుమారానికి దారి తీసింది. సచిన్‌ని యాంటీ-నేషనల్‌ అంటూ ట్రెండింగ్‌లు చేశారు. నిజానికి వరల్డ్‌కప్‌లో పాక్‌పై ఇండియాది ట్రంప్‌ కార్డ్‌ విక్టరీ. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ సచిన్‌, గవాస్కర్‌ చెసిన వ్యాఖ్యలను దేశభక్తులగా చెప్పుకునే వారు తప్పుపట్టారు. నాలుగేళ్లు గడిచిపోయింది. కానీ ఇండియా-పాక్‌ మ్యాచ్‌కు ముందు బాయ్‌కాట్ చేయాలన్న డిమాండ్‌ మారలేదు. అయితే ఈ డిమాండ్‌కి సపోర్ట్ ఇస్తున్న మనుషులే మారిపోయారు. ఇప్పుడు జైషా ఆధ్వర్యంలో బీసీసీఐ.. వరల్డ్‌కప్‌ని హోస్ట్ చేస్తుండగా.. నాటి దేశభక్తులు బాయ్‌కాట్‌ ఊసు ఎత్తడంలేదు. నాటి దేశద్రోహులుగా ముద్రపడ్డ వాళ్లు మాత్రం కొత్త దేశభక్తులుగా మారిపోయారు. సడన్‌గా మన ఆర్మీపై వారికి ప్రేమ పుట్టుకువచ్చింది. అది కూడా జైషా మీద వ్యతిరేకతతో అనుకోండి. అది వేరే విషయం.

అయితే ఇందులో బీసీసీఐ తప్పు లేదు అనుకుంటే పప్పులే కాలేసినట్టే. బుక్‌మైషోలో టికెట్ల వ్యవహారం నుంచి తొలి మ్యాచ్‌లో స్టేడియం నిర్వహణ వరకు క్రికెట్‌ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బీసీసీఐ మరో తప్పు చేసింది. అది కాంగ్రెస్‌కు అస్త్రంగా మారింది. వరల్డ్‌కప్‌లో ఫస్ట్ మ్యాచ్‌కి ప్రారంభ వేడుకలు ఉంటాయి. కానీ, అలా చేయకుండా మధ్యలో మ్యాచ్‌కి సంబరాలు చేయాలని బీసీసీఐ భావించడం విడ్డూరం. రేపటి ఇండియా-పాక్‌ మ్యాచ్‌కి పెద్ద పెద్ద సెలబ్రెటీలను పిలిచింది బీసీసీఐ. ఆట, పాట, డ్యాన్సులు అన్నీ ఉండేలా ప్లాన్ చేసింది. ఇది సోషల్‌ మీడియా బాయ్‌కాట్ బాబులకు మంచి స్టఫ్‌ ఇచ్చిన్నట్టు అయ్యింది. ఓ వైపు జవాన్లు చనిపోతుంటే మరోవైపు పాక్‌తో మ్యాచ్‌కు ముందు సంబరాలు చేసుకుంటారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందులోనూ.. పాక్‌ జట్టు హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు వారికి గ్రాండ్‌ వెల్కమ్‌ లభించింది. ఇప్పుడివే విషయాలను హైలెట్ చేస్తు బీజేపీని కడిగిపారేస్తున్నారు నెటిజన్లు. మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేయాలంటూ ట్రేండ్ చేస్తున్నారు.