Rinku Singh: జట్టులో రింకూ సింగ్.. నయా జోష్‌లో టీమిండియా

ఐర్లాండ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వ్యవహరించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రాకు ఇదే తొలి టోర్నీ కావడం గమనార్హం.

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 02:25 PM IST

Rinku Singh: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓటమిపాలైన టీమిండియా ఇప్పుడు మరో విదేశీ పర్యటనకు సిద్ధమైంది. ఐర్లాండ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వ్యవహరించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రాకు ఇదే తొలి టోర్నీ కావడం గమనార్హం. ఈ సిరీస్‌కు భారత ద్వితీయ శ్రేణి జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో రింకూ సింగ్‌, యశస్వీ జైశ్వాల్‌, తిలక్‌ వర్మ వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కింది.

అదే విధంగా స్పీడ్‌ స్టార్‌ ప్రసిద్ద్‌ కృష్ట ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆగస్టు 18న డబ్లిన్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జస్ప్రీత్‌ బుమ్రా సారధ్యంలోని భారత జట్టు మంగళవారం ఐర్లాండ్‌కు పయనమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫోటోల్లో కెప్టెన్‌ బుమ్రాతో పాటు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌, శివమ్‌ దుబే వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో ఐర్లాండ్‌కు బయలుదేరారు. మరోవైపు విండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగమైన తిలక్‌ వర్మ, అవేష్‌ ఖాన్‌, జైశ్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముఖేష్‌ కుమార్‌, సంజూ శాంసన్‌ నేరుగా ఐర్లాండ్‌కు చేరుకోనున్నారు.