Prithvi Shah: వంద టెస్టులాడిన పుజారా సార్.. నాలాగ బ్యాటింగ్ చేయలేడు

ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌ను మిక్సర్‌లో వేస్తే పృథ్వీ షా వచ్చాడంటూ పేరుగాంచాడు. అయితే, చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 12:45 PM IST

తన కెరీర్‌లో ఆశాజనకమైన ప్రారంభం తర్వాత పృథ్వీ షా.. ఇప్పుడు భారత జట్టులో స్థానం కోసం రేసులో చాలా వెనుకబడి ఉన్నాడు. అయితే, ముంబై యువకుడు తన సహజమైన ‘దూకుడు’తో జాతీయ జట్టులో తన స్థానాన్ని తిరిగి సంపాదిస్తాడని శనివారం చెప్పుకొచ్చాడు. తన ఆటపైనే ఆధారపడతానంటూ చెప్పుకొచ్చాడు. షా భారత్ తరపున తన చివరి మ్యాచ్‌ను జులై 2021లో ఆడాడు. సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ మధ్య జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్ తర్వాత షా మాట్లాడుతూ, “వ్యక్తిగతంగా, నా ఆటను మార్చుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. అవును, నేను నా ఆటను తెలివిగా మెరుగుపరుచుకోగలను. నేను పుజారాలా బ్యాటింగ్ చేయలేను. పుజారా సార్ నాలా బ్యాటింగ్ చేయలేరు” అంటూ చెప్పుకొచ్చాడు.

కెరీర్‌లో ఈ దశలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని చూస్తున్నట్లు షా తెలిపాడు. భారత జట్టులో పునరాగమనం చేసేందుకు ప్రతి పరుగు తనకు చాలా ముఖ్యమైనదని 23 ఏళ్ల ఆటగాడు చెప్పాడు. దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మంచి ప్రారంభాలను భారీ స్కోర్లుగా మార్చడంలో షా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 25, 26 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ బ్యాట్స్‌మెన్‌కు పరిస్థితులు సవాలుగా ఉన్నాయని, అయితే వాటిని ఎదుర్కోవడానికి తమ వద్ద ప్రణాళిక ఉందని షా చెప్పుకొచ్చాడు. మనం ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండడం కుదరదని తెలిపాడు.