Jasprit Bumrah: పేస్ గుర్రం వచ్చేస్తుంది

టీమ్‌ఇండియాకు వరుసగా శుభ శకునాలే ఎదురవుతున్నాయి! గాయాల పాలైన ఆటగాళ్లు వేగంగా కోలుకుంటున్నారు. పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్ ఆసియాకప్‌-2023కి అందుబాటులో ఉంటారని తెలిసింది.

  • Written By:
  • Publish Date - June 17, 2023 / 06:02 PM IST

ఇక ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్‌ తన రికవరీతో బీసీసీఐనే సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు వెన్నెముకగా మారాడు జస్ప్రీత్‌ బుమ్రా ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించాడు. వెన్నెముక గాయంతో 2022 సెప్టెంబర్‌ నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దాంతో ఏప్రిల్‌లో అతడు న్యూజిలాండ్‌కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

సర్జరీ విజయవంతం కావడంతో అతనిప్పుడు వెన్నెముక నొప్పి నుంచి బయటపడ్డాడు. జస్ప్రీత్‌ బుమ్రా ప్రస్తుతం ఫిజియో థెరపీ చేయించుకుంటున్నాడని, కొద్ది కొద్దిగా బౌలింగ్‌ చేస్తున్నాడని తెలిసింది. మెల్లిమెల్లిగా అతడిపై పనిభారం పెంచుతారు. శ్రేయస్‌ మాత్రం ఇంకా ఫిజియో థెరపీ ప్రాసెస్‌లోనే ఉన్నాడని అంటున్నారు. అయితే వీరిని నేరుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడించొద్దని విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు. మొదట దేశవాళీ క్రికెట్లో ఆడించి ఫిట్‌నెస్‌ తనిఖీ చేయాలని సూచిస్తున్నారు.