Ramiz Raja: 400 కొట్టినా పాక్ ఓడిపోతుంది.. పాక్ మాజీ ప్లేయర్ ఫైర్..

ఇటీవల వరల్డ్ నెంబర్ వన్ క్రికెట్‌ టీంగా నిలిచిన పాకిస్తాన్.. ఆ తర్వాత ఈ ర్యాంకు కోల్పోయింది. ఇప్పుడు వరల్డ్ కప్‌ కోసం భారత్ వచ్చిన ఈ టీం.. తమ తొలి వార్మప్ మ్యాచులో చేతులెత్తేసింది. న్యూజిల్యాండ్‌తో జరిగిన ఈ మ్యాచులో పాకిస్తాన్ బ్యాటింగ్ విభాగం ఫర్వాలేదనిపించింది.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 03:27 PM IST

Ramiz Raja: వరల్డ్ కప్‌లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతున్న జట్టు పాకిస్తాన్. కానీ నిలకడ లేమికి పేరొందిన పాకిస్తాన్.. ఇప్పుడు కూడా అలాగే ఆడుతోంది. ఇటీవల వరల్డ్ నెంబర్ వన్ క్రికెట్‌ టీంగా నిలిచిన పాకిస్తాన్.. ఆ తర్వాత ఈ ర్యాంకు కోల్పోయింది. ఇప్పుడు వరల్డ్ కప్‌ కోసం భారత్ వచ్చిన ఈ టీం.. తమ తొలి వార్మప్ మ్యాచులో చేతులెత్తేసింది. న్యూజిల్యాండ్‌తో జరిగిన ఈ మ్యాచులో పాకిస్తాన్ బ్యాటింగ్ విభాగం ఫర్వాలేదనిపించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 80 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ 103 పరుగులతో ఆకట్టుకున్నాడు.

సౌద్ షకీల్ కూడా 75 రన్స్‌ చేశాడు. దీంతో పాకిస్తాన్ ఏకంగా 345 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఈ టీం కచ్చితంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే కివీస్ టీం బ్యాటింగ్ విభాగం కూడా చెలరేగింది. రచిన్ రవీంద్ర 97 పరుగులతో ఆకట్టుకున్నాడు. చాలాకాలం తర్వాత క్రికెట్ ఆడుతున్న కేన్ విలియమ్సన్ కూడా 54 పరుగులతో రాణించాడు. డారియల్ మిచెల్, మార్క్ చాప్‌మాన్ అద్భుతంగా ఆడటంతో కివీస్ ఈ భారీ లక్ష్యాన్ని చాలా ఈజీగా ఛేజ్ చేసేసింది. పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ ఈ మ్యాచ్ ఆడలేదు. అయితే మిగతా బౌలర్లలో హారిస్ రవూఫ్, హసన్ అలీ, మహమ్మద్ వసీం జూనియర్, మహమ్మద్ నవాజ్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో పాక్ టీంపై మాజీ కెప్టెన్ రమీజ్ రజా మండిపడ్డాడు.

ఇంత చెత్తగా బౌలింగ్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అది జస్ట్ ప్రాక్టీస్ గేమ్ అని నాకు తెలుసు. కానీ గెలుపు గెలుపే కదా. అప్పుడే గెలవడం అనేది ఒక అలవాటుగా మారుతుంది. ప్రస్తుతం పాక్‌కు ఓడిపోవడం అలవాటైపోతున్నట్లు కనిపిస్తోంది. ఆసియా కప్ ఓడిపోయారు. ఇప్పుడు 345 రన్స్ చేసి కూడా చిత్తుగా ఓడారు’ అని రమీజ్ రజా అన్నాడు. ఇలాగే ఆడితే, మీరు 400 పరుగులు కొట్టినా కూడా ఫలితం ఉండదు అంటూ ఘాటుగా దుమ్మెత్తిపోశాడు.