ఐపీఎల్ మెగా వేలం సన్ రైజర్స్ రిటైన్ ప్లేయర్స్ వీళ్ళే

ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగావేలం జరగబోతోంది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాపై ఆయా ఫ్రాంచైజీల కసరత్తు దాదాపుగా పూర్తయినట్టే కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - September 3, 2024 / 03:19 PM IST

ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగావేలం జరగబోతోంది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాపై ఆయా ఫ్రాంచైజీల కసరత్తు దాదాపుగా పూర్తయినట్టే కనిపిస్తోంది. గత ఏడాది రన్నరప్ తో సరిపెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునే ఆటగాళ్ళపై తర్జన భర్జన పడుతోంది. రిటైన్ జాబితాలో సఫారీ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఖచ్చితంగా ఉంటాడని చెప్పొచ్చు. గత సీజన్ లో క్లాసెన్ దుమ్మురేపాడు. నాలుగు హాఫ్ సెంచరీలు, 171 స్ట్రైక్ రేట్ తో 479 పరుగులు చేసి జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ లోనూ అతను దూకుడు కొనసాగింది. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ క్లాసెన్ ను హైదరాబాద్ ఫ్రాంచైజీ వదులుకోదు.

అలాగే యువ ఓపెనర్ అభిషేక్ శర్మను కూడా సన్ రైజర్స్ రిటైన్ చేసుకోనుంది. గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ కు మెరుపు ఆరంభానివ్వడంలో అభిషేక్ దే కీరోల్.. గత సీజన్ లో 200కు పైగా స్ట్రైక్ రేట్ తో 484 పరుగులు చేసిన అభిషేక్ శర్మ మరోసారి సన్ రైజర్స్ ఆటగాడిగానే కొనసాగనున్నాడు. అయితే మూడో ప్లేయర్ గా పాట్ కమ్మిన్స్ , ట్రావిస్ హెడ్ లలో ఎవరిని రిటైన్ చేసుకుంటుందనేది చూడాలి. ఎందుకంటే కమ్మిన్స్ ను 20.50 కోట్లకు హైదరాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయగా… జట్టును సమర్థవంతంగా లీడ్ చేసాడు. బౌలర్ గానూ రాణించి 18 వికెట్లు తీశాడు. అదే సమయంలో ట్రావిడ్ హెడ్ కూడా కొన్ని మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. దీంతో భారీ ధర పెట్టిన కమ్మిన్స్ ను వేలంలోకి వదిలేసి మళ్ళీ కొనుగోలు చేయడంపై సన్ రైజర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నాలుగో ప్లేయర్ గా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ లేదా నటరాజన్ ఇద్దరిలో ఒకరిని రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి. భువనేశ్వర్ 2014 నుంచి సన్ రైజర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తుండగా… రిటైర్మెంట్ కు చేరువైన నేపథ్యంలో అతన్ని తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.