India vs Ireland: ఓపెనర్లుగా కొత్త జోడీ.. అదరగొడతామంటున్న యువ ఆటగాళ్లు

నేడు భారత్‌-ఐర్లాండ్‌ మధ్య డబ్లిన్‌ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు స్టార్ బౌలర్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు శుభ్‌మన్‌గిల్ కూడా దూరంగా ఉండటంతో.. భారత్ కొత్త ఓపెనింగ్ జంటతో బరిలోకి దిగనుంది.

  • Written By:
  • Publish Date - August 18, 2023 / 07:57 PM IST

India vs Ireland: ఐర్లాండ్‌తో టీ 20 సిరీస్ కోసం టీమిండియా కుర్రాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు సీనియర్లు ఆసియా కప్‌కి సన్నద్ధమవుతుంటే కుర్రాళ్ళు టీ20ల్లో తమ సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐర్లాండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు యువ టీమిండియా ఐరిష్‌ గడ్డపై ఇప్పటికే అడుగు పెట్టి ప్రాక్టీస్ ప్రారంభించేసింది. నేడు భారత్‌-ఐర్లాండ్‌ మధ్య డబ్లిన్‌ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు స్టార్ బౌలర్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఈ సిరీస్‌కు శుభ్‌మన్‌గిల్ కూడా దూరంగా ఉండటంతో.. భారత్ కొత్త ఓపెనింగ్ జంటతో బరిలోకి దిగనుంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌ ఓపెనర్లుగా ఆడే అవకాశం ఉంది. ఇక మిడిలార్డర్‌లో తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబె, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్ ఉంటారు. స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్.. పేసర్లుగా బుమ్రా, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్‌సింగ్ ఆడే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్ బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ను జియో సినిమా, స్పోర్ట్స్ 18 చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.