Worst Fans: అభిమానం కాదు ఇది శాడిజం, సైకోతనం! గిల్ సిస్టర్‌పై కోహ్లీ ఫ్యాన్స్‌ చెత్త వాగుడు

అభిమానం వెర్రి తలలు వేస్తోంది. ఓడిపోయామన్న బాధతో ప్రత్యర్థి ఆటగాళ్లపై సోషల్‌ మీడియాలో పిచ్చి కూతలు కూయడం ఫ్యాన్స్‌కు కొత్తేమీ కాదు..అయితే ఈ మధ్య ఆటగాళ్ల భార్యలను, పిల్లలను ఇందులోకి లాగుతున్నారు. వారిపై అసభ్య పదాలతో పోస్టులు పెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 06:43 PM IST

కోహ్లీ,గంభీర్‌కు గొడవైతే.. విరాట్ ఫ్యాన్స్‌ గౌతీ భార్యను దూషిస్తూ పోస్టులు పెట్టారు. సరే మెంటల్‌ అనుకుందాం.. ఆవేశంలో పిచ్చిగా చేశారనుకుందాం..అయితే ఈసారి లిమిట్‌ మరింత క్రాస్‌చేశారు. ప్రత్యర్థి ఆటగాడు సెంచరీ కొడితే ఆ ఆటగాడితో పాటు అతని సొదరిని పర్సెనల్‌గా టార్గెట్‌ చేశారు. ఏకంగా ‘ఐటెం’ అంటూ సైకోగాళ్లు లెక్క కామెంట్లు పెట్టారు. ట్రాన్స్‌జెండర్‌లా ఉన్నావంటూ శాడిజం చూపించారు. అందరి ప్రొఫైళ్లకు కోహ్లీ లేదా ఆర్సీబీ డీపీలే.. ఎన్నో ఏళ్లుగా బెంగళూరుకు సపోర్ట్ చేస్తున్నవాళ్లే. ఈసారి కూడా బెంగళూరు కప్‌ గెలవలేక..కనీసం ప్లేఆఫ్‌కు కూడా రాలేక గుజరాత్‌పై గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయే సరికి..మెంటల్‌ పీక్స్‌కు వెళ్లిపోయినట్టుంది. ఏం మాట్లాడుతున్నారో..ఏం పోస్టులు పెడుతున్నారో వాళ్లకే తెలియని స్టేజీలోకి వెళ్లిపోయారు అభిమానులు..! సారీ.సారీ.. అభిమానులు కాదు.. పిచ్చొళ్లు..!

పక్కా ప్లాన్‌తో టార్గెట్‌:
గుజరాత్‌పై బెంగళూరు ఓడిపోయింది. 197పరుగులను కూడా కాపాడుకోలేక ఐపీఎల్‌ నుంచి ఇంటిముఖం పట్టింది. యంగ్‌ గన్‌ శుభమన్‌గిల్‌ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్‌కు తిక్కలేచింది. వెంటనే శుభమన్‌గిల్‌పై సోషల్‌మీడియాలో నోటికి వచ్చిన చెత్త రాయడం మొదలుపెట్టారు. కొంతమంది గిల్‌ చచ్చిపోవాలని పోస్టులు పెట్టారు. ఓ అమ్మాయి మనసు గెలవడం కోసం మొత్తం హిందుస్థాన్ హృదయాన్ని ముక్కలు చేశావ్ కదరా.. అంటూ మరికొందరు గిల్‌పై ఎక్స్‌ట్రా జోకులు వేశారు. ఇది సచిన్‌ కూతురు సారాని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్‌. వాళ్లిద్దరికి ఏదో ఉందని.. ముంబై ఇండియన్స్‌ మెంటర్‌ సచిన్‌ను ఫ్టాట్‌ చేయడం కోసం గిల్‌ సెంచరీ చేశాడంటూ కామెంట్లు చేశారు. ఇక ఈ పిచ్చి వాగుడు అంతటితో ఆగలేదు.. కోహ్లీ టీమ్‌ ఓడిపోతే హిందుస్థాన్ బాధపడిపోయిందంటూ.. అదానీ పరువును ఇండియా పరువుకు బీజేపీ భజనగాళ్లు లింక్‌ పెట్టినట్లు.. ఇక్కడ అదే రకం కామెంట్ చేశాడు. ఆర్సీబీ ఓడిపోతే ఇండియా మనసు ఎందుకు ముక్కలవుతుంది..? ఇంకా చెప్పాలంటే ఆర్సీబీ ఓడిపోయినందుకు అటు మిగిలిన టీమ్‌ అభిమానులు ఆనందపడ్డారు.. లక్నో, సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌ అయితే పార్టీలు కూడా చేసుకున్నారు..అందులో జరుగుతున్నది ఐపీఎల్‌.. ఏదో దేశం కోసం ఆర్సీబీ ఆడినట్లు ఎందుకా కట్టింగ్‌ కామెంట్లు..?

స్టేడియంలో తన్నులాటలు:
ఈ ఏడాది ఐపీఎల్‌లో ఫ్యాన్స్‌ స్టేడియం గ్యాలరీల్లోనూ హద్దు మీరారు. మా టీమ్‌ గొప్పంటే మా టీమ్‌ గొప్పంటూ తన్నుకున్నారు. ఆర్సీబీ అభిమానులు బాడీ షేమింగ్‌లగు దిగారు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతని బాడీని డీగ్రేడ్‌ చేస్తూ అరుపులు, కేకలు వేశారు. అసలు పాత తరం ఫ్యాన్స్‌కు నేటి ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు అసలు పోలికే ఉండడంలేదు. తమిళ, తెలుగు హీరో ఫ్యాన్స్‌ లెవల్‌కు దిగజారిపోయి మరీ గొడవలు పడుతుండడం చూస్తుంటే.. త్వరలోనే వీళ్లు కూడా వాళ్ల లెక్కే తయారవడం ఖాయంగా కనిపిస్తోంది.