Sri Lanka: పాక్‌పై శ్రీలంక విక్టరీ.. ఫ్యాన్స్‌లో గందరగోళం..!

ఈ మ్యాచులో ఫ్యాన్స్‌ని ఒక అనుమానం వెంటాడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 252 పరుగులు చేస్తే సరిగ్గా శ్రీలంక కూడా అన్నే పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కి వెళ్ళాలి కదా.. శ్రీలంకను ఎలా విజేతగా ప్రకటించారు..? అని అనుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 06:30 PM IST

Sri Lanka: ఆసియా కప్‌లో భాగంగా గురువారం జరిగిన సూపర్-4 మ్యాచులో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచులో అసలంక విన్నింగ్ రన్స్ కొట్టి లంకను ఫైనల్‌కి చేర్చాడు. కుశాల్ మెండిస్ 91 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. సదీర్ సమరవిక్రమ 48 పరుగులతో రాణించాడు. అయితే ఈ మ్యాచులో ఫ్యాన్స్‌ని ఒక అనుమానం వెంటాడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 252 పరుగులు చేస్తే సరిగ్గా శ్రీలంక కూడా అన్నే పరుగులు చేసింది.

దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కి వెళ్ళాలి కదా.. శ్రీలంకను ఎలా విజేతగా ప్రకటించారు..? అని అనుకుంటున్నారు. అయితే, పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచులో మొదట 45 ఓవర్లకు, ఆ తర్వాత 42 ఓవర్లకు మ్యాచుని కుదించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పాక్ ఇన్నింగ్స్ అనంతరం లంక టార్గెట్‌ని డక్ వర్త్ లూయిస్ ప్రకారం 252 గా ప్రకటించారు. సాధారణంగా ఒక 5 లేదా 10 పరుగులు వ్యత్యాసం ఉంటే ఈ టార్గెట్‌పై అంత చర్చ ఉండేది కాదు. కానీ ఒక్క పరుగే ఉండేసరికి అభిమానుల ఆశ్చర్యానికి గురయ్యారు. కొంతమందికైతే శ్రీలంక గెలిచేవరకు ఇద్దరి స్కోర్లు సమంగా ఉన్నాయనే సంగతి గ్రహించలేకపోయారు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించకపోతే పాక్ స్కోరు కూడా అదే కాబట్టి.. లంక 253 పరుగులు చేస్తే గెలిచేది.

కానీ పలుమార్లు వర్షం పడడంతో డీఎల్ఎస్ ప్రకారం లంక టార్గెట్‌ని 252 గా నిర్ణయించారు. కాబట్టి డీఎల్ఎస్ నిర్ణయం ఫైనల్ కావడంతో ఈ విషయంపై ఎవరూ ఏమి చేయలేరు. సాధారణ మ్యాచ్ అయితే ఇది సూపర్‌ ఓవర్‌కు వెళ్లాల్సింది. కానీ డీఎల్ఎస్ విధానం వల్ల మ్యాచ్ శ్రీలంక సొంతమైంది. దీంతో ఫైనల్‌లో భారత్, పాక్ మ్యాచ్ చూడాలి అనుకున్న ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు.