Kapil dev: ఆ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌కు 40ఏళ్లు! ఆ మ్యాచ్‌ని టెలిక్యాస్ట్‌ చేయకపోవడానికి బీబీసీ స్టైక్ కారణం కాదు..! అసలు రీజన్ ఇదే..

భారత్‌ క్రికెట్‌ గతిని మార్చిన ఇన్నింగ్స్‌ అది..! 1983 వరల్డ్‌ కప్‌లో జింబాబ్వేపై కపిల్‌దేవ్‌ ఆడిన ఇన్నింగ్స్‌ నెవర్‌ బిఫోర్‌..ఎవర్‌ ఆఫ్టర్‌..! అయితే ఆ మ్యాచ్‌ టెలిక్యాస్ట్ కాలేదు.. అసలు కారణం తెలిస్తే షాక్‌ అవుతారు!

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 04:05 PM IST

క్రికెట్ టీమ్‌ గేమే కావొచ్చు.. కానీ జట్టు మొత్తం విఫలమైన చోట.. ఏ ఒక్కరైనా ఆదుకొని..అద్భుతంగా ఆడితే.. ఆ ఇన్నింగ్స్‌ని చిరకాలం గుర్తిండిపోతుంది. టీమిండియా తరఫున అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడినా వాళ్లు చాలా మందే ఉన్నా.. అందరికంటే ముందు.. అసలు ఇలా కూడా ఆడతారా అనేలా ఆడిన ఇన్నింగ్స్‌ ఒకటి ఉంది. అదే 1983లో జింబాబ్వేపై కపిల్ దేవ్‌ చేసిన 175పరుగుల ఇన్నింగ్స్‌.! ఆ కాలంలోనే 138 బంతుల్లో 175పరుగులు చేయడమంటే మాముల విషయం కాదు. పెద్ద సైజు గ్రౌండ్లలో పట్టుమని పది పరుగులు చేయలేక చేతులెత్తేస్తున్న కాలమిది. అలాంటిది ఆరో నంబర్‌ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్‌ టీమిండియాను గెలుపు బాట పట్టించాడు.

1983లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవడం దేశంలో క్రికెట్‌ స్థితిని మార్చేసింది. ఆ ఒక్క వరల్డ్‌కప్‌ సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ లాంటి వారిని క్రికెట్‌ వైపు అడుగులు వేసేలా చేసింది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్‌లో అప్పటికీ రెండుసార్లు ప్రపంచ కప్‌ విజేత వెస్టిండిస్‌ని ఓడించి ఇంగ్లిష్‌ గడ్డపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడేలా చేసింది. అయితే అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్‌ వరకు ఎలా వచ్చింది..? లీగ్ మ్యాచ్‌లతో పాటు సెమీస్‌లో రాణిస్తేనే ఎవరైనా ఫైనల్‌కి వస్తారు. నేరుగా ఫైనల్‌కి రారన్న విషయం అందరికి తెలిసిందే.

లీగ్‌ దశ చివరికి చేరుకున్న సమయంలో జింబాబ్బేపై టీమిండియా చావోరెవో తేల్చుకోవాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కపిల్‌ సేన 17 పరుగులకే 5వికెట్టు కోల్పోయింది. నిజానికి ఇక్కడ స్కోర్‌ కార్డ్‌ చూసిన వాళ్లు ఎవరైనా టీమిండియా 50లోపే దుకాణం సర్దేయడం ఖాయమంటారు. కానీ ఆ కీలక మ్యాచ్‌లో టీమిండియా 267పరుగుల చేసిందంటే అది కేవలం కపిల్‌ దేవ్ పుణ్యమే. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కపిల్ దేవ్ 138 బంతుల్లో 16 ఫోర్లు.. 6 సిక్స్‌లతో 175 పరుగులతో అజేయంగా నిలిచి క్రికెట్ చరిత్రలోనే మరిచిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు. ఓడాల్సిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగులతో విజయం సాధించింది.

ఇక ఈ మరుపురాని ఇన్నింగ్స్‌ టెలిక్యాస్ట్ అవ్వలేదన్న విషయం చాలామందికి తెలిసిన విషయమే..! అప్పటి మ్యాచ్‌లను బీబీసీ టెలిక్యాస్ట్ చేసేది. ఆ రోజు బీబీసీ స్ట్రైక్ చేసిందని.. మ్యాచ్‌లు అందుకే టెలిక్యాస్ట్ కాలేదని అందరూ చెబుతుంటారు. అయితే ఇది నిజం కాదట..! నిజానికి ఆ రోజు బీబీసీ స్టైక్‌లో లేదు. అదే రోజు నాలుగు లీగ్‌ మ్యాచ్‌లు ఉండగా.. బీబీసీ కేవలం రెండిటిని మాత్రమే కవర్‌ చేయాలని నిర్ణయించుకుంది. నాలుగు లీగ్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి బీబీసీ అలానే చేస్తుంది. గత మ్యాచ్‌ల్లో వ్యూస్‌ బెస్‌ చేసుకోని రెండు మ్యాచ్‌లకు టెలిక్యాస్ట్ చేస్తుంది. అంతకముందు జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా మ్యాచ్‌లకు వ్యూస్‌ రాలేదు. దీంతో మన గేమ్‌కి కెమెరాలు పంపలేదు. అలా కపిల్ దేవ్ ఆడిన ఇన్నింగ్స్‌ రికార్డు కాలేదు.. ఈ ఐకానిక్ ఇన్నింగ్స్‌ని కేవలం గ్యాలరీలో ఉన్న అభిమానులు మాత్రం చూడగలిగారు..!