Rohith Sharma: ఫొటోలో రోహిత్ లేడు.. అభిమానుల్లో ఆందోళన

ఆదివారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌కి కూడా హిట్‌మ్యాన్ దూరంగా ఉండబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ.. అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది.

  • Written By:
  • Updated On - March 31, 2023 / 04:12 PM IST

ఐపీఎల్ 16 సీజన్‌కి సమయం ఆసన్నమయింది. నేటి నుంచి అంటే మార్చి 31 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నాయి. ఇక మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌కు ఒక రోజు ముందు.. గురువారం కెప్టెన్స్ ఫొటో షూట్‌ నిర్వహించారు. తొలి మ్యాచ్‌కి వేదిక అయిన అహ్మదాబాద్‌ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఫోటోషూట్ జరిగింది.

దీనిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మినహా.. మిగిలిన 9 జట్లకు చెందిన కెప్టెన్స్ హాజరయ్యారు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఈ షూట్‌లో పాల్గొన్నాడు. కానీ.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోనే ఉన్నా కెప్టెన్స్ ఫోటోషూట్‌కి రాలేదు. అందుబాటులో ఉన్నప్పటికీ ఐపీఎల్ కెప్టెన్స్ ఫోటోషూట్‌కి హిట్ మ్యాన్ గైర్హాజరీ అదరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా.. రోహిత్ శర్మకి గాయమైందని అందుకే షూట్‌కి దూరంగా ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియా వేదికగా ఊపందుకున్నాయి. ఈ కారణంతోనే ఆదివారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌కి కూడా హిట్‌మ్యాన్ దూరంగా ఉండబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ.. అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అదేమిటంటే.. రోహిత్ శర్మ అనారోగ్యం కారణంగానే అహ్మదాబాద్‌లో జరిగిన కెప్టెన్స్ ఫోటోషూట్‌కి దూరంగా ఉన్నాడని ముంబై ఇండియన్స్ టీమ్ వర్గాలు తెలిపాయి. అలానే బెంగళూరుతో ఆదివారం జరిగే మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉంటాడని కూడా స్పష్టం చేశాయి. సమస్య చిన్నదేనని, ఫ్యాన్స్ కంగారు పడనవసరంలేదని టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. దీంతో అటు ముంబై అభిమానులు, ఇటు హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.