Yashaswi Jaiswal: మనల్ని పానీపూరి బండి నడిపింది.. ఇప్పుడు నువ్వు టీమిండియాను నడుపుతున్నావ్.. నాన్న గుక్కపెట్టి ఏడ్చాడు

ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపిస్తోన్న యశస్వి జైస్వాల్‌ టీమ్‌ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో టీమ్ ఇండియాకు రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన యశస్వి త్వరలో ప్రారంభమయ్యే విండీస్‌ సిరీస్‌లో మెయిన్‌ టీమ్‌లో ప్లేస్‌ దక్కించుకున్నాడు.

  • Written By:
  • Publish Date - June 25, 2023 / 04:17 PM IST

ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపిస్తోన్న యశస్వి జైస్వాల్‌ టీమ్‌ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో టీమ్ ఇండియాకు రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన యశస్వి త్వరలో ప్రారంభమయ్యే విండీస్‌ సిరీస్‌లో మెయిన్‌ టీమ్‌లో ప్లేస్‌ దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టెస్టు సిరీస్‌ల కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ టెస్టు జట్టుకు జైస్వాల్‌ను ఎంపిక చేసింది. ఈక్రమంలో ఛటేశ్వర్‌ పూజారా ప్లేస్‌ను యశస్వి భర్తీ చేస్తాడని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ యంగ్‌ సెన్సేషన్‌ రోహిత్‌కు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.

కాగా టీమ్ ఇండియా టాప్ ఐదు బ్యాటర్లంతా రైట్ హ్యాండెడ్ ఆటగాళ్లే. జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్‌ అవసరం ఉంది. ఈ క్రమంలో జైస్వాల్‌ రాకతో మిడిలార్డర్‌ మరింత బలోపేతమవుతోందని భావిస్తోంది టీమ్‌ మేనేజ్‌మెంట్. మరోవైపు భారత జట్టుకు ఎంపిక కావడంపై జైస్వాల్ మాట్లాడుతూ.. ‘నేను టీమిండియాకు ఎంపికైనట్లు మా నాన్నకు తెలియగానే ఎమోషనల్‌ అయ్యారు. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం నేను ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నాను. ఇంకా ఇంటికి వెళ్లలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత అమ్మ ఎలా స్పందిస్తుందోనని ఆత్రుతగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు జైస్వాల్‌.

ఇక విండీస్‌తో సిరీస్‌కు సన్నద్ధత గురించి మాట్లాడుతూ.. ‘ నేను బెంగళూరులోని ఎన్‌సిఎలో శిక్షణ కోసం వెళ్లబోతున్నాను. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భాగంగా సీనియర్ ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేయడం నాకు చాలా ప్రయోజనకరంగా మారింది. సీనియర్ ఆటగాళ్ల నుంచి చాలా నేర్చుకున్నాను. జట్టులో అవకాశం వస్తే నా వంతు ప్రయత్నం చేస్తాను. అవకాశం దొరికినప్పుడు సాధించాలనే లక్ష్యం కూడా ఉంటుంది. కరేబియన్ టూర్‌కు జట్టును ప్రకటించే వరకు నేను చాలా ఆందోళనకు గురయ్యాను. కానీ టీమ్‌కి ఎంపికైన తర్వాత చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు యశస్వి. కాగా ముంబై తరఫున ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఆడిన జైస్వాల్ కేవలం 15 మ్యాచ్‌ల్లో 80.21 సగటుతో తొమ్మిది సెంచరీలతో 845 పరుగులు చేశాడు. 2023 ఐపీఎల్‌లో 163.61 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన జైస్వాల్ 625 పరుగులు చేశాడు.