Rohit Sharma: అందరినీ సంతోషపెట్టలేం.. వరల్డ్ కమ్ టీమ్ పై రోహిత్ వ్యాఖ్యలు

జట్టులో అందరినీ సంతోషపెట్టలేమంటూ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 25 మందిలో 15 మందిని ఎంపిక చేసినప్పుడు మిగిలిన వారు తమను ఎందుకు తీసుకోలేదని అడుగుతారన్నాడు. అలాగే 15 మంది నుంచి 11 మందిని తుది జట్టుకు ఎంపిక చేసినప్పుడూ ఇదే ప్రశ్నఎదురవుతుందని చెప్పుకొచ్చాడు.

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 01:21 PM IST

Rohit Sharma: కొత్త ఏడాదిలో జరగనున్న ప్రపంచకప్‌కు ముందు ఏకైక టీ ట్వంటీ సిరీస్ భారత్ ఆడేసింది. ఆప్గనిస్థాన్‌పై 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. టోర్నీలో పలువురు యువ ఆటగాళ్లు ఆకట్టుకోగా.. ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన రోహిత్.. చివరి మ్యాచ్‌లో అదరగొట్టేశాడు. ప్రస్తుతం టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఎంపికయ్యే జట్టుపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి జట్టు ఇంకా ఖరారు కాలేదన్నాడు. 25 మంది పూల్ నుంచి తాము 15మందిని ఎంపిక చేయాల్సి ఉందన్నాడు.

U19 World Cup 2024: ఇక కుర్రాళ్ల ప్రపంచకప్.. టైటిల్ ఫేవరెట్‌గా భారత్

8 మంది వరకూ ఖరారైనా.. మిగిలిన వారిని సెలక్ట్ చేసే విషయంలో తీవ్రంగా చర్చించాల్సిందేనని రోహిత్ అంగీకరించాడు. కోచ్ ద్రవిడ్, తాను దీనిపై ఆలోచలను చేస్తున్నామని చెప్పాడు. జట్టులో అందరినీ సంతోషపెట్టలేమంటూ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 25 మందిలో 15 మందిని ఎంపిక చేసినప్పుడు మిగిలిన వారు తమను ఎందుకు తీసుకోలేదని అడుగుతారన్నాడు. అలాగే 15 మంది నుంచి 11 మందిని తుది జట్టుకు ఎంపిక చేసినప్పుడూ ఇదే ప్రశ్నఎదురవుతుందని చెప్పుకొచ్చాడు. అయినప్పటకీ జట్టు గెలవడమే లక్ష్యంగా ఎంపిక ఉంటుందని, దీనిని ప్రతీ ప్లేయర్ అంగీకరించాల్సిందేనని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఆప్ఘనిస్తాన్‌తో సిరీస్‌లో శివమ్ దూబే, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లు అదరగొట్టడంతో వచ్చే ప్రపంచకప్ కోసం జట్టు ఎంపిక మరింత కష్టతరంగా మారింది.

హార్థిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ ఉన్నప్పటకీ.. శివమ్ దూబేను కూడా జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. దీనితో పాటు జట్టులో ప్రతీ ప్లేస్‌ కోసం కనీసం ఇద్దరు పోటీ పడుతుండడంతో 15 మంది ఎంపిక సెలక్టర్లకు మరింత సవాల్ కానుంది. కాగా వెస్టిండీస్, అమెరికా పిచ్‌లు కాస్త భిన్నంగా ఉంటాయని, ఉపఖండంలో రాణించినంత సులభం కాదని రోహిత్ చెప్పాడు. కాగా జట్టు ఎంపికలో ఐపీఎల్‌లో ప్రదర్శనను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే వరల్డ్ కప్ జరగనుండడంతో జట్టులో చోటు ఆశించే యువ ఆటగాళ్లకు ఈ లీగ్ కీలకం కానుంది.