Bitthiri Sathi: ఎన్నికల బరిలో బిత్తిరి సత్తి..! పోటీ ఎక్కడి నుంచంటే..

తెలుగు రాష్ట్రాల జనాలకు బాగా దగ్గరయ్యాడు సత్తి. అతని అసలు పేరు రవికుమార్‌. టీవీ షోలతో బిజీగా ఉండగానే ఇప్పుడు రాజకీయాల్లోనూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్‌ రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కూడా కారణం లేకపోలేదు.

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 07:06 PM IST

Bitthiri Sathi: తెలంగాణలో బిత్తిరి సత్తి పేరు తెలియని వారు ఉండరు..! తనదైన మాట తీరు, నటనతో తెలంగాణలో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. చాలా న్యూస్‌ చానెళ్లలో సెటైరికల్ వార్తలు, కామెడీ షోలు చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. బిత్తిరోడు అనే కేరక్టర్ క్రియేట్‌ చేసి.. తన మార్క్‌ హావాభావాలతో వినోదాన్ని పంచుతూ.. తెలుగు రాష్ట్రాల జనాలకు బాగా దగ్గరయ్యాడు సత్తి. అతని అసలు పేరు రవికుమార్‌. టీవీ షోలతో బిజీగా ఉండగానే ఇప్పుడు రాజకీయాల్లోనూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్‌ రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కూడా కారణం లేకపోలేదు. ఈ మధ్య సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో ముదిరాజ్ ఆత్మగౌరవ సభ జరిగింది.

ఈ కార్యక్రమానికి బిత్తిరి సత్తి అటెండ్ అయ్యాడు. ఆ సమయంలో బిత్తిరి సత్తి మాట్లాడిన మాటలే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. ముదిరాజ్‌ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూనే రాజకీయ పార్టీలను ఉద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు సత్తి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్‌ను టార్గెట్‌ చేసుకున్నాడు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో.. ముదిరాజ్ సామాజికవర్గానికి ఒక్క సీటు కేటాయించకపోవడంపై బిత్తిరి సత్తి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటల తర్వాత బిత్తిరి సత్తి పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రచారం ఊపందుకుంది. ఐతే ఇప్పుడు ఆ ప్రచారం మరో అడుగు పడింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నుంచి అసెంబ్లీకి బిత్తిరి సత్తి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. జడ్చర్లలో ముదిరాజ్ ఓటర్లు ఎక్కువ. అందుకే ఈ నియోజకవర్గాన్ని బిత్తిరి సత్తి సెలెక్ట్ చేసుకున్నాడని మరికొందరు గుసగుసలాడుతున్నారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలు కూడా.. జడ్చర్ల నుంచి పోటీ చేయాలని సత్తి మీద ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా సరే.. తాము మద్దతుగా నిలుస్తామని హామీ ఇస్తున్నారట. ఐతే స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తే.. ఇబ్బందులు తప్పవనే ఆలోచనలో బిత్తిరి సత్తి ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. త్వరలో బీజేపీలో కీలక నేతలను కూడా కలవబోతున్నాడట. పరేడ్‌గ్రౌండ్స్‌ సభకు ఈటెల కూడా హాజరయ్యారు. బిత్తిరి స్పీచ్‌కు ఈటెల కూడా ఫిదా అయ్యారనే ప్రచారం నడుస్తోంది మరి.