TELANGANA CONGRESS: కాంగ్రెస్‌తో కామ్రేడ్ల పొత్తు కష్టమేనా.. ఎర్రన్నల దారి ఒంటరి దారేనా ?

కాంగ్రెస్ బలమైన సీట్లను కామ్రేడ్లు పట్టుబడుతుండడంతో.. పొత్తు విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. సీపీఐకి రెండు స్థానాలు... సీపీఎంకు రెండు స్థానాలు ఇవ్వాలని ప్రాథమికంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - October 26, 2023 / 03:58 PM IST

TELANGANA CONGRESS: ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన కాంగ్రెస్‌.. సెకండ్‌ లిస్ట్ విషయంలో తెగ హైరానా పడుతోంది. మీటింగ్‌ల మీద మీటింగ్‌లు.. ఒపీనియన్‌ల మీద ఒపీనియన్‌లు.. వీటన్నింటి చేరికలు.. ఇలాంటి పరిణామాల మధ్య రెండో జాబితాలో ఎవరి పేరు ఉంటుంది.. ఎవరికి చాన్స్ దక్కబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదంతా ఎలా ఉన్నా.. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చి.. ఇన్ని రోజులు గడుస్తున్నా.. కాంగ్రెస్‌, కామ్రేడ్ల పొత్తు చర్చలు ఒక కొలిక్కి రావడం లేదు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన బీఆర్ఎస్.. వరుస సభలతో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇంకా సీట్ల పంచాయితీ దగ్గరే ఆగిపోయింది. కమ్యూనిస్టులతో పొత్తు చర్చలు ఇంకా సాగుతూనే ఉన్నాయ్.

కాంగ్రెస్ బలమైన సీట్లను కామ్రేడ్లు పట్టుబడుతుండడంతో.. పొత్తు విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. సీపీఐకి రెండు స్థానాలు… సీపీఎంకు రెండు స్థానాలు ఇవ్వాలని ప్రాథమికంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు కేటాయించాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు కూడా ! ఐతే సీపీఎం విషయంలో అసలు సమస్య కనిపిస్తోంది. సీపీఎంకు మిర్యాలగూడ ఒక స్థానం ఖరారు కాగా.. రెండో స్థానం కోసం తర్జన భర్జనలు జరుగుతున్నాయ్. పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుపడుతోంది. ఐతే ఇప్పటికే ఖమ్మం సీటు తుమ్మలకు, పాలేరు పొంగులేటికి కాంగ్రెస్ కన్పార్మ్‌ చేసింది. ఈ ఇద్దరు నేతలు జిల్లావ్యాప్తంగా.. పార్టీని గట్టెక్కించే స్థాయిలో ఉండటంతో ఆ సీట్ల విషయంలో కాంగ్రెస్ మరో ఆలోచనకు తావివ్వడం లేదు. పాలేరు బదులు వైరా స్థానాన్ని ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించగా.. దానికి సీపీఎం అంగీకరించడం లేదు. ఖమ్మం జిల్లాను తమ కంచుకోటగా భావిస్తున్న కమ్యూనిస్టులు.. కచ్చితంగా ఒక సీట్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

దీంతో పొత్తు చర్చలు ఒక పొలిక్కి రావడం లేదు. ఈ పరిణామాలు ఇలాగే కంటిన్యూ అయితే.. ఎవరి దారి వారు చూసుకోవడమే మంచిదని కామ్రేడ్లు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. బలంగా ఉన్న స్థానాలను వదులుకోవడం కంటే.. పొత్తు వదులుకోవడం బెటర్ అని కాంగ్రెస్‌ కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐతే జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో ఈ రెండు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయ్. దీంతో ఈ సమస్యకు పరిష్కారాన్ని జాతీయస్థాయిలో చర్చించుకోవాలని రెండు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రెండు మూడు రోజుల్లో పాలేరు స్థానంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.