MP EXIT POLLS: మధ్యప్రదేశ్‌లో నువ్వా.. నేనా..? కాంగ్రెస్.. బీజేపీ పోటా పోటీ..

మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 230 సీట్లల్లో 116 స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారాన్ని చేపడుతుంది. ఎగ్జిట్ పోల్స్ లో రిపబ్లిక్ టీవీ –మాట్రిజ్ బీజేపీకి ఎడ్జ్ ఉన్నట్టు ప్రకటించింది. 118 నుంచి 130 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంటోంది.

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 07:56 PM IST

MP EXIT POLLS: 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17 నాడు ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రానికి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 2005 నుంచి బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ రెండేళ్ళు తప్ప మిగతా కాలమంతా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నెక్ట్స్ టైమ్ కూడా అధికారం చేపడితే ఐదోసారి అవుతుంది. అయితే బీజేపీ ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. అటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో కలసి ఈ ఎన్నికల్లో బీజేపీపై పోరాటం చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 230 సీట్లల్లో 116 స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారాన్ని చేపడుతుంది.

TS EXIT POLLS: కాంగ్రెస్‌కే మొగ్గు.. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే..!

ఎగ్జిట్ పోల్స్ లో రిపబ్లిక్ టీవీ –మాట్రిజ్ బీజేపీకి ఎడ్జ్ ఉన్నట్టు ప్రకటించింది. 118 నుంచి 130 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంటోంది. అలాగే కాంగ్రెస్ కు 97 నుంచి 107 సీట్లు దక్కవచ్చని తెలిపింది. టీవీ9 భరత్ వర్ష్ – పోల్ స్ట్రాట్ మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించింది. హస్తం పార్టీ 111 నుంచి 121 స్థానాలు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో ప్రకటించింది. బీజేపీకి 106 నుంచి116 కు మించి రావని చెబుతోంది. దైనిక్ భాస్కర్ కూడా కాంగ్రెస్.. మెజారిటీకి కొద్ది సీట్ల తేడాతో అధికారం దక్కించుకుంటుందని చెబుతోంది. జన్ కీ బాత్ మాత్రం మధ్యప్రదేశ్ లో హంగ్ పరిస్థితులు వస్తాయంటోంది. కానీ న్యూస్ 24 టుడేస్ చాణక్య సర్వే.. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందనీ…ఆ పార్టీయే అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ లో ప్రకటించింది. కమలం పార్టీకి 151 సీట్లు వస్తాయనీ… కాంగ్రెస్ 74 స్థానాలకే పరిమితం అవుతుందని అంటోంది. మొత్తమ్మీద మధ్యప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ మాత్రం.. కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉందని చెబుతున్నాయి. ఒకటి రెండు సంస్థలు మాత్రమే రెండు పార్టీల వైపు క్లియర్ మెజారిటీని ప్రకటించాయి. బీజేపీ వ్యూహాత్మకంగా ఈసారి మధ్యప్రదేశ్ లో ఏడుగురు ఏంపీలను అసెంబ్లీ బరిలోకి దింపింది.

వీళ్ళల్లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే కూడా ఉన్నారు. 2020లో కాంగ్రెస్ లో ఉన్న జ్యోతిరాదిత్య సింధియా 15 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి.. బీజేపీలో చేరడంతో కమల్ నాథ్ సర్కార్ కూలిపోయింది. ఈసారి సింధియా సాయం లేకుండానే సొంతంగానే అధికారం చేపడతామని కమల్ నాథ్ చెబుతున్నారు. చూడాలి.. డిసెంబర్ 3నాడు మధ్యప్రదేశ్ ఓటర్లు ఏమని తీర్పు చెబుతారో.