RAHUL GANDHI: తెలంగాణపై రాహుల్ ఫోకస్.. మరోసారి బస్సు యాత్రకు హాజరు..!

రాహుల్‌ను రెండోసారి బస్సు యాత్రలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ నేతలు కోరారు. దీనికి రాహుల్ కూడా అంగీకరించినట్లు తెలిసింది. మరోసారి రాహుల్ బస్సు యాత్రలో పాల్గొనడం ఖాయమైంది.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 06:45 PM IST

RAHUL GANDHI: తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా దృష్టి సారించారు. ఇటీవలే కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రలో పాల్గొన్న రాహుల్.. మరోసారి బస్సు యాత్రలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతోపాటు ఆయన సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ ఈ నెల 18న బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో రాహుల్ గాంధీ మూడు రోజులపాటు పాల్గొన్నారు.

మొదటి రోజు ప్రియాంకా గాంధీ కూడా హాజరయ్యారు. ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల్లో సాగిన ఈ యాత్రకు మంచి స్పందన వచ్చింది. రాహుల్ గాంధీ.. స్థానిక ప్రజలతో మమేకమైన తీరుకు మంచి ఆదరణ దొరికింది. దీంతో ఇంకా కాంగ్రెస్‌కు ఆదరణ దక్కేలా చేయాలంటే రాహుల్, ప్రియాంకా గాంధీ వంటి నేతలు మరోసారి పర్యటించడమే సరైందని పార్టీ భావిస్తోంది. దీంతో రాహుల్‌ను రెండోసారి బస్సు యాత్రలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ నేతలు కోరారు. దీనికి రాహుల్ కూడా అంగీకరించినట్లు తెలిసింది. మరోసారి రాహుల్ బస్సు యాత్రలో పాల్గొనడం ఖాయమైంది. రెండో విడత ఈనెల 28 నుంచి ప్రారంభం అవుతుంది.

అయితే, రాహుల్ ఈ యాత్రలో ఎప్పుడు పాల్గొనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే రాహుల్ పర్యటన షెడ్యూల్ ఖరారవుతుంది. నవంబర్ మొదటివారంలో రాహుల్ ఈ బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రియాంకా గాంధీ కూడా మరో వారంలో తెలంగాణలో పర్యటించబోతున్నారు. అక్టోబర్ 31న రాష్ట్రంలో మళ్ళీ ప్రియాంక గాంధీ పర్యటిస్తారు. ఆమె పాలమూరు జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాహుల్, ప్రియాంక పర్యటనలతో తెలంగాణ కాంగ్రెస్‌లో మరింత జోష్ పెరిగే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు.