REVANTH REDDY: ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు ఎందుకంత దుఃఖం: రేవంత్ రెడ్డి

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసినా.. ధర్మం వైపు నిలబడాలని రాష్ట్రం ఇచ్చారు. లెక్కలు వేసుకుని, స్వార్ధం చూసుకుంటే వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు.

  • Written By:
  • Updated On - November 3, 2023 / 02:35 PM IST

REVANTH REDDY: ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వమే పెద్ద దళారిగా మారిందని విమర్శంచారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (REVANTH REDDY). ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్‌ (KCR)కు ఎందుకంత దుఃఖం అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ విధానాల గురించి వివరించారు.

“ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వమే పెద్ద దళారీగా మారింది. ధరణిలో అత్యంత పెద్ద దళారులు కేసీఆర్ కుటుంబ సభ్యులే. మేం ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు ఎందుకంత దుఃఖం? మన రాష్ట్రం గురించి చెప్పాలంటే తెలంగాణ వచ్చాక, తెలంగాణ రాకముందు అని చెప్పుకోవాలి. తెలంగాణ ప్రజలు కోరుకుంది స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి. రాష్ట్రం ఒక వ్యక్తి ఉక్కుపాదాల కింద నలిగిపోతోంది. అందుకే రాష్ట్ర ప్రజల కోసం నా వంతుగా పోరాడుతున్నా. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసినా.. ధర్మం వైపు నిలబడాలని రాష్ట్రం ఇచ్చారు. లెక్కలు వేసుకుని, స్వార్ధం చూసుకుంటే వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. శ్రీకాంతాచారి లాంటి అమరుల త్యాగాలను గుర్తించి సోనియా తెలంగాణ ఇచ్చారు. దశాబ్దం గడిచినా నీళ్లు, నిధులు నియామకాలు సాధించుకున్నమా..? ఒకసారి ఆలోచన చేయాలి. టీఆర్ఎస్‌ను పోలి ఉండేందుకే వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని పెట్టారు. రాష్ట్ర అధికారిక ముద్ర రాజరిక పోకడను తలపిస్తోంది. త్యాగాలను గుర్తు చేసేలా ఉండాల్సిన చిహ్నం రాచరికాన్ని తలపిస్తోంది. తెలంగాణ చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలి. కానీ శ్రీమంతుల తెలంగాణ తల్లిని మనకు కేసీఆర్ చూపిస్తుండు.

JANASENA: వెనక్కి తగ్గిన పవన్..? తెలంగాణలో జనసేన పోటీ కష్టమే..!
రాచరిక పాలన..
త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో రాచరికపోకడ కొనసాగుతోంది. తెలంగాణలో ప్రజాస్వామ్యం లోపించింది. ప్రజల హక్కులను కేసీఆర్ కాలరాశారు. రాష్ట్రంలో అందరినీ వర్గ శత్రువులా కేసీఆర్ చూస్తున్నారు. ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రజలు తమ బాధలు చెప్పుకోలేని పరిస్థితి. గతంలో పాలకులు ప్రజలకు సచివాలయంలో అందుబాటులో ఉండేవారు. కానీ ఇవాళ ప్రతిపక్ష నేతలకు, జర్నలిస్టులకు సచివాలయంలోకి ప్రవేశం లేదు. కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్. మార్పు జరగకుండానే ఉద్యమకారుల జీవితాలు తారుమారయ్యాయి. కేసీఆర్ పాపాల పుట్ట పగిలింది.. మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీనీ ఈ పదేళ్లలో నెరవేర్చలేదు. ప్రజలని మోసం చేసిన కేసీఆర్ లాంటి మోసగాళ్లకు తెలంగాణలో స్థానం లేదు. పదేళ్లలో ఎవరి భవిష్యత్ బాగుపడింది..? ఎక్కడ బంగారు తెలంగాణ? కర్ణాటకలో కాంగ్రెస్ (CONGRESS) గెలవద్దని ప్రచారం చేశారు. అంటే పరోక్షంగా కేసీఆర్ కోరుకుంది మోదీ గెలుపేనా..?
సంక్షేమం తెచ్చిందే కాంగ్రెస్..
2050 వరకు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నాం. కేసీఆర్ గురించి తెలంగాణలోని కేసీఆర్ బాధితులే చెబుతారు. జర్నలిస్టులు కూడా కేసీఆర్ బాధితులే. తెలంగాణలో బీఆర్ఎస్‌తో సహా ఇతర పార్టీలను కోరుతున్నా. విధివిధానాలపై ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళదాం. చుక్క మందు, డబ్బు లేకుండా ఎన్నికల్లోకి వెళదాం. పిల్లర్లు కుంగాయి కాబట్టే మేడిగడ్డ బ్యారేజీ జాయింట్‌లో గ్యాప్ పెరిగింది. ఒక మీటరు కుంగింది అని అధికారులే చెబుతున్నారు. తప్పించుకోవడానికే కేటీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారు. మేం తప్పు చెబుతున్నామంటే.. అఖిలపక్షాన్ని తీసుకెళదాం. ప్రాజెక్టు కుంగిందో లేదో వాళ్లే చెబుతారు. సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. పెన్షన్లు, పక్కా ఇళ్లు లాంటి పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్. కేసీఆర్ తాను చేసింది చెప్పుకోలేక కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ వాదనల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎప్పుడూ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడలేదు. మైనారిటీలను అన్ని రకాలుగా సంక్షేమంలో భాగస్వాములను చేస్తాం. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. పేదలకు విద్యను చేరువ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన స్కూళ్లలో 6,540 సింగిల్ టీచర్ స్కూళ్లను కేసీఆర్ హయాంలో మూసేశారు.

Congress : చేరికలు… బుజ్జగింపులు.. ! కాంగ్రెస్ ఫటా ఫట్ ప్లాన్ ..!!
కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టి..
రైతులకు ఎకరానికి ఏటా 10వేలు ఇస్తామని 2014లోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. దాన్నే కాపీ కొట్టి కేసీఆర్ రైతు బంధు పేరుతో ఇస్తున్నారు. తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకే పక్క రాష్ట్రాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్ దశాబ్ద పాలన-బీఆరెస్ దశాబ్ద పాలనపై చర్చకు సిద్ధం. ఓటుకు వెల కట్టే సంస్కృతి తెచ్చిందే కేసీఆర్. హైదరాబాద్‌లో ఐటీకి పునాది వేసింది కాంగ్రెస్. హైదరాబాద్‌ను పెట్టుబడి నగరంగా తీర్చిదిద్దుతాం. గంగా నదిలా మూసీని ప్రక్షాళన చేస్తాం. మూసీ రివర్ ఫ్రంట్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసే ప్రణాళిక మా దగ్గర ఉంది. అర్బన్, రూరల్ హైదరాబాద్‌కు కనెక్టివిటీ ఇవ్వనున్నాం. రాచకొండ గుట్టలను తెలంగాణ ఊటీలా అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్‌ను ప్రపంచానికే తలమానికంగా మారుస్తాం. కమ్యూనిస్టులతో పొత్తుల అంశం ఇంకా ముగియలేదు. పొత్తు అంశంపై మా సమన్వయ కమిటీ చర్చలు జరుపుతోంది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.