VOTING PERCENTAGE: గతం కంటే తగ్గిన పోలింగ్.. ఇది బీఆర్ఎస్‌కు ప్లస్సేనా..?

పోలింగ్ పర్సంటేజ్ తగ్గడం ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. పర్సంటేజ్ తగ్గడం ఎవరికి కలిసొస్తుందని అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. సాధారణంగా పోలింగ్ పర్సంటేజ్ తగ్గితే అది అధికారపార్టీకే లాభం అని పొలిటికల్ అనలిస్ట్స్ చెబుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 07:30 PM IST

VOTING PERCENTAGE: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రెండు నెలల పాటు ఉన్న కోలాహలం ముగిసింది. ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు.. బీఆర్ఎస్‌కి హ్యాట్రిక్ విజయం ఇస్తారా.. మార్పు కావాలని కోరిన కాంగ్రెస్‌కి అధికారం కట్టబెడతారా.. లేదంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం బీజేపీని ఎంపిక చేసుకున్నారా.. ఇవన్నీ తేలాలంటే డిసెంబర్ 3 దాకా వెయిట్ చేయాలి. కానీ గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గడం అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చకు దారితీసింది. ఇది తమకు ప్లస్సే అని బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు.

REVANTH REDDY: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది.. తెలంగాణకు దొరల పాలన నుంచి విముక్తి: రేవంత్ రెడ్డి

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 73.74 శాతం దాకా పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి చూస్తే 60 శాతానికి మించి నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎప్పటిలాగే హైదరాబాద్ సిటీ ఓటర్లు గడప దాటి బయటకు రాకపోవడంతో ఇక్కడ 35 శాతానికి మించి పోలింగ్ జరగలేదు. ఎన్నికల కమిషన్ ఎంత ప్రచారం చేసినా.. గతం కంటే దాదాపు 10 శాతం ఓటింగ్ తగ్గింది. పోలింగ్ పర్సంటేజ్ తగ్గడం ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. పర్సంటేజ్ తగ్గడం ఎవరికి కలిసొస్తుందని అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. సాధారణంగా పోలింగ్ పర్సంటేజ్ తగ్గితే అది అధికారపార్టీకే లాభం అని పొలిటికల్ అనలిస్ట్స్ చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు అనుకున్న స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు రాలేదు. ముఖ్యంగా ఈసారి యూత్ అంతా ఓట్లేస్తారని అనుకున్నారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడతాయని భావించారు. కానీ వీళ్ళల్లో కొత్తగా ఓట్లు వచ్చిన వారు మాత్రమే ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారే తప్ప.. మిగతా వాళ్ళెవరూ ఓట్లు వేయలేదని అర్థమవుతోంది.

గతం కంటే ఎక్కువగా పోలింగ్ నమోదు అయి ఉంటే.. ప్రభుత్వ వ్యతిరేకత బాగా కనిపించేది. అలాగే.. జనం భారీగా వచ్చి తమ వ్యతిరేకతను చాటుకున్నారు అని చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ గతం కంటే తక్కువ ఓటింగ్ నమోదు కావడం చూస్తే మాత్రం.. అది ఖచ్చితంగా తమకే లాభిస్తుందనీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడలేదని బీఆర్ఎస్ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ తప్పనీ.. తాము హ్యాట్రిక్ కొడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. గతంలోనూ ఇలాగే తప్పుడు రిపోర్టులు ఇచ్చారనీ.. డిసెంబర్ 3నాడు ఇవన్నీ తప్పని రుజువవుతాయని ధీమాగా చెబుతున్నారు. తాము 70కు పైగా సీట్లతో అధికారం దక్కించుకుంటామని చెబుతున్నారు. పోలింగ్ పర్సంటేజ్ కూడా తగ్గదనీ.. నియోజకవర్గాల వారీగా ఫైనల్ ఓటింగ్ శాతం బయటకు వస్తే మరింత స్పష్టత వస్తుందని కేటీఆర్ అంటున్నారు.