Election Petitions : ఆ ఎమ్మెల్యేల ఎన్నిక అక్రమం… KTR, హరీశ్,కౌశిక్ రెడ్డి సహా 24 మందిపై పిటిషన్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) పోటీ చేసి గెలిచిన 24 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎలక్షన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 24 మంది మీద 30 దాకా పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ సమర్పించారు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు. అఫిడవిటల్స్ లో తప్పులు, ఈవీఎంలు, వీవీ పాట్స్ లో లోపాలు లాంటి కారణాలతో ఈ పిటిషన్లు ఫైల్ అయ్యాయి.

 

 

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) పోటీ చేసి గెలిచిన 24 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎలక్షన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 24 మంది మీద 30 దాకా పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ సమర్పించారు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు. అఫిడవిటల్స్ లో తప్పులు, ఈవీఎంలు, వీవీ పాట్స్ లో లోపాలు లాంటి కారణాలతో ఈ పిటిషన్లు ఫైల్ అయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao), ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) తో పాటు అనేకమంది BRS ఎమ్మెల్యేలపైనే ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ ఎమ్మెల్యేలు అక్రమంగా గెలిచారనీ తమనే విజేతులగా ప్రకటించాలని కోరారు పిటిషన్ దారులు. ఎన్నికలు జరిగిన 45 రోజుల్లోపు ఫిర్యాదు చేయాల్సి ఉంది. ఆ గడువు ఈనెల 28తో ముగిసింది.

సిరిసిల్ల నుంచి MLAగా ఎన్నికైన కేటీఆర్ పై ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఎన్నికల పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తన కొడుకు హిమాన్షును డిపెండెంట్ గా కేటీఆర్ చూపించలేదనీ… అఫిడవిట్ లో తప్పులున్నాయని కంప్లయింట్ చేశారు. హిమాన్షు పేరుతో 32 ఎకరాల భూమి ఉంది. దాన్ని కొనడానికి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది… అమెరికా యూనివర్సిటీలో చదివే హిమాన్షు ఫీజులు కేటీఆర్ కడుతున్నారు. కానీ డిపెండెంట్ గా ఎందుకు చూపించలేదని తన పిటిషన్ లో ప్రశ్నించారు మహేందర్ రెడ్డి. కేటీఆర్ కొడుకు ఆస్తులను అఫిడవిట్ లో ఎందుకు చూపించలేదని మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఎమ్మెల్యే హరీశ్ రావు ఎన్నికపై బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్ ఎలక్షన్ పిటిషన్ వేశారు. మాధవరం కృష్ణారావు… ఎన్నికల కోడ్ కి విరుద్ధంగా… తోపుడు బండ్లు పంపిణీ చేశారు ఫిర్యాదు చేశారు.

హుజూరాబాద్ లో ఈసారి తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపైనా ఎన్నికల పిటిషన్ దాఖలైంది. ఓటర్లను బెదిరించారంటూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సంఘటనపై ఇటీవలే గవర్నర్ తమిళిసై కూడా తీవ్రంగా స్పందించారు. అలాంటి వాళ్ళపై ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలని పేరు ప్రస్తావించకుండా కామెంట్ చేశారు గవర్నర్. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపైనా ఈపీ దాఖలైంది. 2018 ఎన్నికలకు సంబంధించి ఆయన అనర్హులవగా… సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఈ విషయం ఎన్నికల అఫిడవిట్ లో చూపించలేదని… కాంగ్రెస్ అభ్యర్థి సరిత పిటిషన్ వేశారు. ఇలా పటాన్ చెరువు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, కొత్తగూడెం, షాద్ నగర్, మల్కాజిగిరి ఎమ్మెల్యేపై ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు పిటిషన్లు వేశారు. అయితే 2018 నాటి ఎన్నికల పిటిషన్లు ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. కొత్తగూడెం, గద్వాల ఎమ్మెల్యేలను హైకోర్టు అనర్హులుగా ప్రకటించింది. వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు.