Coromandel Express: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..!

భారత రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటనగా మిగిలింది కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం. కోరమాండల్ ఎక్స్ ప్రెస్.. పశ్చిమబెంగాల్‌లోని హౌరా స్టేషన్ నుంచి మొదలై.. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ వరకు సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 10:17 AM IST

Coromandel Express: ఒడిశా రైలు ప్రమాద ఘటన నుంచి ఇంకా దేశం కోలుకోలేదు. ఆ రక్తపు మరకలు ఇంకా ఆరలేదు. ఏ రైలు శబ్దం వినిపించినా.. రైలు పట్టాలు కనిపించినా.. ఆ విషాదమే కళ్ల ముందు కదులుతోంది. రెండు రైళ్లు.. పది నిమిషాల వ్యవధిలో ఢీకొట్టడంతో వందల ప్రాణాలు గాల్లో కలిశాయ్. వేల ప్రాణాలు ఊపిరి కోసం పోరాడుతున్నాయ్. ఈ మధ్య కాలంలో దేశం ఎప్పుడూ చూడని రైలు ప్రమాదం అది. ఈ ప్రమాదంలో దాదాపు 3వందల మందికి పైగా చనిపోయారు. మానవ తప్పిదమే కారణం అని అధికారులు చెప్తున్నా.. పోయిన ప్రాణాలకు, ఇంటి పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు.
భారత రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటనగా మిగిలింది కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం. కోరమాండల్ ఎక్స్ ప్రెస్.. పశ్చిమబెంగాల్‌లోని హౌరా స్టేషన్ నుంచి మొదలై.. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ వరకు సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది. దాదాపు 16వందల 61 కిలోమీటర్లు ప్రతీరోజూ ఈ రైలు నడుస్తుంది. దీనికి కోరమాండల్ అనే పేరు పెట్టడానికి ఓ బలమైన కారణం ఉంది. 1977 మార్చి 6న ఈ రైలు మొదటిసారి ప్రారంభం అయింది. గరిష్టంగా ఇది గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

తూర్పు రాష్ట్రాలు, తమిళనాడును అనుసంధానం చేసే ముఖ్యమైన రైళ్లలో కోరమాండల్ ఒకటి. 13వ శతాబ్దం వరకు కూడా చోళ సామ్రాజ్యం దాదాపు దక్షిణ భారతదేశమంతటా విస్తరించి ఉండేది. ఒడిశాతో పాటు పశ్చిమబెంగాల్ వరకు చోళుల ప్రభావం ఉండేది. చోళులు పాలించిన ప్రాంతాన్ని కోరమండలం అని పిలిచేవారు. బ్రిటీష్ వాళ్లు ఈ ప్రాంతాన్ని కోరమండల్ అని అని పిలిచేవాళ్లు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని అదే పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతాలన్నింటిని కలుపుతూ.. తీర ప్రాంతం వెంట ప్రయాణించే రైలు కావడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌గా రైల్వే శాఖ పేరు పెట్టింది. ఈ రైలు పశ్చిమబెంగాళ్ నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ప్రాంతాలను కలుపుతూ ప్రయాణిస్తుంది. ప్రాంతం పేరు.. రైలు పేరు అయింది. ఆ రైలు పేరు ఇప్పుడు పీడకలగా మారింది. ఈ గాయం నుంచి ప్రాణాలు ఎప్పుడు కోలుకుంటాయో ఏమో మరి !