Actor Suman : వైసీపీలోకి నటుడు సుమన్.. ఆ స్థానం నుంచే ఎంపీగా పోటీ..?

తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సుమన్ (Suman). ప్రస్తుతం ఆయన పొలిటికల్‌ మూవీకి క్లాప్‌ కొట్టాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వైసీపీ (YCP) కండువా కప్పుకుంటారన్న టాక్‌ నడుస్తోంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్... రాజమండ్రి ఎంపీ సీట్లో పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీని మీదే ఇప్పుడు లోకల్‌గా హాట్‌ హాట్‌ చర్చ నడుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2024 | 03:10 PMLast Updated on: Jan 27, 2024 | 3:10 PM

Actor Suman Joins Ycp Can Contest As Mp From That Position

తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సుమన్ (Suman). ప్రస్తుతం ఆయన పొలిటికల్‌ మూవీకి క్లాప్‌ కొట్టాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వైసీపీ (YCP) కండువా కప్పుకుంటారన్న టాక్‌ నడుస్తోంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్… రాజమండ్రి ఎంపీ సీట్లో పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీని మీదే ఇప్పుడు లోకల్‌గా హాట్‌ హాట్‌ చర్చ నడుస్తోంది.

ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రంగా ఉన్న రాజమండ్రి (Rajahmundry) నుంచి గతంలో జమున, మురళీమోహన్ (Murali Mohan) లాంటి సినీ నటులు ఎంపీలుగా గెలిచారు. అలాంటి సీటులో ఈసారి సుమన్‌ని దింపాలని గట్టిగానే కసరత్తు చేస్తోందట వైసీపీ. ఈ మేరకు పార్టీ పెద్దలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఎప్పుడూ ఓసీ అభ్యర్థులే పోటీ చేసే రాజమండ్రి లోక్‌సభ సీటు నుంచి గత ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలో దింపి విజయం సాధించింది వైసీపీ. ఆ క్రమంలోనే ఈసారి కూడా బీసీ అభ్యర్థినే పోటీకి పెడతామని ప్రకటించారు ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ మిధున్ రెడ్డి.

గట్టి అభ్యర్థి కోసం వెదుకుతుండటంతో గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్‌ పేరు తెర మీదికి వచ్చిందట. తెలుగు ప్రేక్షకులకు సుమన్‌గా పరిచితుడైన తల్వార్ సుమన్ గౌడ్‌… తెలుగు, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లో కలిపి మొత్తం 700కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన స్వస్థలం మంగుళూరు. మాతృభాష తుళు. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రుడైన ఈ నటుడు… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కరాటే సమాఖ్యకు అధ్యక్షుడు. రాజమండ్రిలో 25 ఏళ్ళ నుంచి నడుస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థకు గౌరవ సలహాదారుడిగా ఉన్నారు సుమన్. ఈ సంస్థ ద్వారా వృద్ధాశ్రమం, బధిరుల స్కూల్‌, అనాధలకు నిత్య అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తన మిత్రులు నడిపే ఈ సంస్థ కార్యక్రమాల కోసం తరచూ హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి వచ్చి పోతుంటారు సుమన్‌. రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీలే డిసైడింగ్ ఓట్ ఫ్యాక్టర్‌. దీంతో సామాజిక సమీకరణలతో పాటు వ్యక్తిగత ఛరిష్మా ఉన్న సుమన్‌ని పోటీకి దింపితే… ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ప్రభావం ఉంటుందని నమ్ముతోందట వైసీపీ అధినాయకత్వం. అందుకే ఆయన కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అన్నీ అనుకూలిస్తే… రాజమండ్రి వైసీపీ అభ్యర్థిగా సుమన్‌ ప్రకటించే అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల టాక్‌. మరి తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.